Gauravelli Project Review: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ముగ్గురు జిల్లాల కలెక్టర్లు.. రాష్ట్ర అడ్వకేట్ జనరల్.. ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని.. లీగల్ సమస్యలను క్లియర్ చేసి రైతులకు సాగునీరు అందించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే.. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం ఒత్తిడి తెస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు.
ఈ సమావేశంలో ప్రధానంగా భూసేకరణ.. నిధుల విడుదల.. న్యాయపరమైన ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని అధికారులకు.. మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఎన్విరాన్మెంట్ కేసుపై ఎల్లుండి సుప్రీం కోర్టులో విచారణ ఉందని.. ఈ కేసులో ప్రభుత్వం విజయం సాధిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయ చిక్కులను అధిగమించి ప్రాజెక్టును అన్ని విధాలుగా పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు దేవాదుల ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరేలా పెండింగ్లో ఉన్న కాల్వల పనులను కూడా సత్వరమే పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సిద్దిపేట.. కరీంనగర్.. హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వ్యవహరించి భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి నిర్ణీత కాలపరిమితిలో పనులు ముగిసేలా ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
Read Also: Maoist Rehabilitation: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!