Swetcha Effect: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ ప్రజల దాహార్తిపై ‘స్వేచ్ఛ’ పత్రిక ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. మార్చి 27వ తేదీన “నిప్పులు చెరుగుతున్న భానుడు కంటికి కనిపించని చలివేంద్రాలు” అనే శీర్షికతో ‘స్వేచ్ఛ’ పత్రికలో వచ్చిన వార్త మున్సిపల్ యంత్రాంగంలో కదలిక తెచ్చింది. వేసవి తీవ్రత పెరుగుతున్నా చలివేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపుతూ, ప్రజల ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరించిన వార్తకు ప్రతిస్పందనగా నేడు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
గత వారం స్వేచ్ఛ పత్రికలో వచ్చిన కథనంపై పట్టణ ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఏసీ గదులకే పరిమితమైన అధికారులు క్షేత్రస్థాయిలోకి రావాలని, పేద ప్రజల దాహార్తిని తీర్చాలని పత్రికా ముఖంగా చేసిన డిమాండ్కు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్ సానుకూలంగా స్పందించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత రద్దీగా ఉండే అంబేడ్కర్ చౌరస్తాలో తక్షణమే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా?.. ఈ మార్క్ లేకపోతే అస్సలు కొనకండి..
గురువారం మధ్యాహ్నం అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా మరిన్ని కీలక ప్రాంతాల్లో కూడా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
‘స్వేచ్ఛ’ పత్రిక కథనం వల్లనే అధికారులు మేల్కొని చలివేంద్రం ఏర్పాటు చేశారని హుజూరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తెచ్చి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ‘స్వేచ్ఛ’ పోషించిన పాత్ర అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
Also Read: బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ సేవలు బంద్!