Moinabad Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సిట్ (SIT) ఇంచార్జి.. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ దర్యాప్తుకు సంబంధించిన కీలక అప్డేట్స్ వెల్లడించారు. ఈ డ్రగ్ పార్టీని పైలెట్ రోహిత్ రెడ్డే స్వయంగా ఆర్గనైజ్ చేశారని.. ఎంపీ మహేష్ కుమార్ను కూడా అతనే ఆహ్వానించారని డీసీపీ స్పష్టం చేశారు.
పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోగా.. పైలెట్ రోహిత్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించారని అధికారులు తెలిపారు. “గన్ ఫైరింగ్ చేయండి.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను” అంటూ రోహిత్ రెడ్డి అరవడంతో.. అతని ఆదేశాల మేరకు నమిత్ శర్మ పోలీసులపైకి నేరుగా కాల్పులు జరిపినట్లు డీసీపీ వివరించారు. పోలీసులు మొదట మూడు రౌండ్లు హెచ్చరించినప్పటికీ.. నిందితులు ఖాతరు చేయకుండా మరో రౌండ్ కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులపై ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఎంపీ మహేష్ కుమార్కు నిర్వహించిన పరీక్షల్లో రెండు రకాల డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇది మొదటిసారి కావడంతో ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? గతంలో కూడా ఇలాంటి పార్టీలు జరిగాయా? అనే కోణంలో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి.. రితేష్ రెడ్డి.. నమిత శర్మలను ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తలు.. అడ్వకేట్లు ఈ పార్టీకి ఎందుకు వచ్చారు? వ్యాపార లావాదేవీల కోసమే ఈ విందు ఏర్పాటు చేశారా? అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డిని పూర్తిస్థాయిలో విచారిస్తే డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ గుట్టు రట్టు అవుతుందని పోలీసులు కోర్టుకు వివరించారు.
మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఉన్న డ్రగ్స్ కోణాన్ని.. ఆయుధాల వినియోగాన్ని లోతుగా విచారించేందుకు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో మొత్తం 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందానికి సిట్ చీఫ్గా యోగేష్ గౌతమ్ (డీసీపీ చేవెళ్ల) వ్యవహరిస్తారు. రవీందర్ రెడ్డి (గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్), శిరీష(డీసీపీ షాద్నగర్), హరీష్ చంద్ర రెడ్డి(డీఎస్పీ ఈగల్ ఫోర్స్), బుచ్చయ్య(డీఎస్పీ ఈగల్ ఫోర్స్),మల్లికార్జున్ రెడ్డి(మొయినాబాద్ ఎస్హెచ్ఓ), వీరితో పాటు మరో ముగ్గురు ఎస్సైలు ఈ బృందంలో సభ్యులుగా ఉండి దర్యాప్తులో సహకరిస్తారు.
Read Also: యశోద ఆసుపత్రిలో డాక్టర్ గా నటిస్తూ.. మత్తు ఇంజక్షన్తో రోగులను లూటీ చేస్తున్న కిలేడీ