మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు తాజాగా తమ కస్టడీలోకి తీసుకున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితీష్ రెడ్డిలను చంచల్ గూడ జైలు నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు రోజుల పాటు వీరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించనున్నారు. ఏ1 నిందితుడైన ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ ప్రస్తుతం చంచల్ గూడ జైలులోనే ఉన్నాడు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించారు. డ్రగ్స్ పార్టీల నిర్వహణ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏమిటి? నిందితుల మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ రకంగా సాగాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు వీరిని మూడు విడతలుగా ఎనిమిది రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ సమయంలో జరిగిన విచారణలో డ్రగ్ పార్టీలకు సంబంధించి కీలక ఆధారాలను సిట్ సేకరించింది. ప్రధాన నిందితుల బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన విందులో డ్రగ్స్ వాడకం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో పాత నేరస్తులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి జరిగింది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే విషయాలను పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన డిజిటల్ ఆధారాలను కూడా నిందితుల ముందు ఉంచి విచారిస్తున్నారు.
ALSO READ: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమం.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో పోరాటం