Mothkupalli Narsimhulu: గాంధీ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎస్సీ వర్గీకరణ, దళిత ఐక్యతపై ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసుకున్న పుణ్యమని ఆయనను ప్రశంసించారు. దళిత వర్గాలకు ఇది ఒక గొప్ప వరమని పేర్కొంటూ.. రిజర్వేషన్లు ఇచ్చే దమ్ము, ధైర్యం ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉన్నాయని ఆయన ప్రశంసించారు.
మాల, మాదిగ ఉప కులాలు కలిసి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. దళిత వర్గాల మధ్య చీలిక వస్తేనే సమస్యలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లో దళిత వర్గాలన్నీ ఐక్యంగా ఉండి మద్దతు తెలపడం వల్లే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పాలనలో ఎక్కడో చిన్న లోపం ఉందని దానిని వెతుక్కుని సరిచేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.
ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రతి నెలా ఒకసారి దళిత ప్రజా ప్రతినిధులందరూ సమావేశం కావాలని మోత్కుపల్లి ప్రతిపాదించారు. ఇలాంటి సమావేశాల ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను చర్చించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మనకు మనమే సమస్యలు సృష్టించుకోవద్దని హితవు పలికారు. దళితుల కోసం తాను చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో చుండూరులో మాలలను ఊచకోత కోసినప్పుడు.. అసెంబ్లీ సాక్షిగా ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఏకైక మాదిగ వ్యక్తిని నేనేనని ఆయన గర్వంగా చెప్పుకున్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతూ.. గతంలో తనకు టికెట్ నిరాకరించినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దళితుణ్ణి అని తన పట్టుదలను వివరించారు. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడే వ్యక్తులకు ప్రాధాన్యత ఉండాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడిందని.. ఈ ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.
Read Also: 90 శాతం హోటళ్లు మూతపడే ప్రమాదం.. గ్యాస్ సంక్షోభంపై కేంద్రానికి కేటీఆర్ లేఖ