MP Chamala Kiran Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారం కోల్పోదని హరీష్ రావు కలలు కన్నారని, కేసీఆర్ తర్వాత కేటీఆర్ వల్ల ఏమీ కాదని భావించి, తానే ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు ఆశపడ్డారని చామల ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 30 శాతం కూడా అమలు చేయలేదని ఎంపీ విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందని, ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కూడా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్లలో సాధించింది ఏమైనా ఉందంటే అది కేవలం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టడం మాత్రమేనని విమర్శించారు. 2014, 2018 మేనిఫెస్టోల అమలుపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైఖరిని కూడా చామల తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రం దోపిడీకి గురవుతోందని పదేళ్ల తర్వాత పార్లమెంట్లో కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంపై నిజంగా ప్రేమ ఉంటే, పదేళ్లుగా బీఆర్ఎస్ దోపిడీ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాగా కిషన్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని, కానీ బీఆర్ఎస్ దోపిడీని అడ్డుకోలేకపోయినందుకే జనాలు బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్కు పట్టం కట్టారని గుర్తు చేశారు. కేవలం పత్రికల్లో హెడ్ లైన్స్ కోసమే బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని చామల ఆరోపించారు. విదేశాల నుండి నల్లధనం వెలికితీస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీశారు. కేరళలోని శబరిమల బంగారం స్కామ్ విషయంలో పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై మొదట బీఆర్ఎస్ మాట్లాడటం, ఆ తర్వాత అదే అంశాన్ని బీజేపీ ఎత్తుకోవడం చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన స్పష్టమవుతోందని అన్నారు.
తాము ఎవరికీ భూములను దారాదత్తం చేయడం లేదని, పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం సరికాదని విపక్షాలకు హితవు పలికారు. ప్రెస్ మీట్ ల ద్వారా ప్రభుత్వాలు కూలిపోవని, ఐదేళ్ల తర్వాతే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు.
Read Also: