Chamala Kiran Kumar Reddy: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో గత పదేళ్లుగా జరిగిన టెండర్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కీలక లేఖ రాశారు.
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల కేటాయింపులో తలెత్తిన అవకతవకలపై కేంద్రం తక్షణమే స్పందించి, ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని నియమించినందుకు ఎంపీ చామల కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ విచారణను కేవలం నైనీ బ్లాక్ టెండర్ రద్దుకు మాత్రమే పరిమితం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడాలంటే మరింత లోతైన దర్యాప్తు అవసరమని ఆయన బలంగా నొక్కి చెప్పారు.
2014 సంవత్సరం నుండి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులు మరియు అధికారిక నిర్ణయాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్ ప్రక్రియలను కూడా ఈ ఉన్నత స్థాయి విచారణ బృందం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. గత పదేళ్లుగా టెండర్ల కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే, వాటిని తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో పారదర్శకతను కాపాడటం మరియు ప్రజాహితాన్ని కాపాడటం అత్యంత అవసరమని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా కేంద్ర మంత్రికి లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని వెలికితీయాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది.