Chamala Kiran Kumar Reddy: దివంగత ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో తీసుకురావడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెబుతూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను టార్గెట్ చేయడమే ఏకైక అజెండాగా అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న భారీ ఆదరణను చూసి అమిత్ షా తట్టుకోలేకపోతున్నారని చామల ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే రాహుల్ గాంధీపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. “మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మారుస్తామని అమిత్ షా చెప్పారు.. మీ అజెండా ప్రకారం మీరు నక్సలిజాన్ని అంతమొందించుకోండి, దాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ ఆ సాకుతో కాంగ్రెస్ పార్టీ చరిత్రను బద్నాం చేయాలని చూడటం దారుణం” అని హితవు పలికారు.
ప్రజా గాయకుడు గద్దర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చామల తీవ్రంగా ఖండించారు. గద్దర్ తన మావోయిస్టు సిద్ధాంతానికి ఎప్పుడో స్వస్తి పలికి, తెలంగాణ సంస్కృతి, చరిత్ర మరియు సంప్రదాయాల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే అమిత్ షాకు వచ్చిన నొప్పి ఏంటని ప్రశ్నించారు. జూలై 20, 2022న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పాల్గొన్న సభకు గద్దర్ హాజరైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు. “అమిత్ షా సభకే హాజరైన గద్దర్ తో రాహుల్ గాంధీ స్టేజ్ పంచుకుంటే అది అపరాధం ఎలా అవుతుంది?” అని నిలదీశారు.
లోక్ సభలో గద్దర్ గురించి అమిత్ షా తప్పుగా మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఎందుకు నోరు మెదపలేదని చామల ప్రశ్నించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గద్దర్ స్వయంగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసుల గురించి చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకపక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెబుతూనే, మరోపక్క సిద్ధాంతాన్ని వదిలేసి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చిన గద్దర్ వంటి వారిని కించపరచడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని చామల ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ ను విమర్శించడం అంటే తెలంగాణ ప్రజలను విమర్శించడమేనని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: అప్పులు పెరిగాయి.. ఆస్తులు కరగలేదు.. కాగ్ రిపోర్టుతో కళ్లు తెరవాలన్న హరీష్ రావు