Dharmapuri Arvind: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై స్పందించిన ఆయన, తాను ఎవరికీ పైసలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని, ప్రజలను ఒప్పించి పార్టీ వైపు తిప్పుకోవడమే తన పని అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి గెలవడమే తమకు తెలుసని, అనైతిక రాజకీయాలకు తావులేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మేయర్ ఎన్నికల సమీకరణాల గురించి మాట్లాడుతూ, అవతలి పార్టీల లెక్కలతో తమకు సంబంధం లేదని అరవింద్ అన్నారు. “మేము ప్రజల మనసు గెలుచుకున్నాం, మా పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా విజయం సాధించారు. ఈ ఫలితాలను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం” అని ఆయన తెలిపారు. తాను మేయర్ పీఠం కోసం రెండు కోట్లు లేదా మూడు కోట్లు ఇస్తానన్న వార్తల్లో నిజం లేదని, తాను రెండు రూపాయలు కూడా ఎవరికీ ఇవ్వనని గట్టిగా చెప్పారు. ఎవరికైనా బీజేపీ సిద్ధాంతాలు, నరేంద్ర మోదీ పాలన లేదా తన పనితీరు నచ్చితే ఓటు వేయాలని, అంతేకానీ ప్రలోభాలకు గురిచేసే సంస్కృతి తమది కాదని ధ్వజమెత్తారు.
మేయర్ ఎన్నికల వ్యూహంపై క్లారిటీ ఇస్తూ, తమ పార్టీ కార్పొరేటర్లందరికీ ఇప్పటికే విప్ జారీ చేసినట్లు అరవింద్ వెల్లడించారు. తమ పార్టీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ అభ్యర్థులకే తమ వారు ఓటు వేస్తారని, ఇతర పార్టీల అభ్యర్థులతో తమకు ఎలాంటి పని లేదని స్పష్టం చేశారు. “నేను ప్రజల హృదయాలను గెలవడానికి ఇక్కడ ఉన్నాను, ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాను. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు.
2 కోట్లు-3 కోట్లు కాదు, 2 రూపాయలు కూడా ఇయ్యను, ప్రజా ప్రతినిధుల్ని కొనుక్కోను!!
ప్రజా క్షేత్రంలో నిలిచినం, గెలిచినం !!
We earned the people’s mandate through trust and conviction. The rest is arithmetic.. Horse-trading is not my path ! pic.twitter.com/YPFf8Bu31M
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 15, 2026