Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ కేసులో కరీం భార్య సలీమా బేగం, అతని వరుసకు తమ్ముడైన గౌస్ పాషాను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూల్ సిఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ మర్డర్ కేస్ వివరాలను వెల్లడించారు.
గౌస్ పాషా గతంలో కరీం నిర్వహించే హోటల్లో పనిచేసేవాడని, ఈ క్రమంలో కరీం భార్య సలీమా బేగంతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై కరీం, సలీమా బేగం మధ్య తరచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ సంబంధం కొనసాగడంతో కరీంను హత్య చేయాలని సలీమా బేగం, గౌస్ పాషా కలిసి పథకం వేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నెల 9న సలీమా బేగం నెల్లూరులోని దర్గాకు వెళ్లిన అనంతరం కరీంను హత్య చేయాలని గౌస్ పాషాకు వాట్సాప్ కాల్లో చెప్పినట్లు వెల్లడించారు.
Also read: నకిలీ పన్నీర్ దందాకు సర్కార్ చెక్.. ఏడాది పాటు అనలాగ్ పన్నీర్పై నిషేధం!
పథకం ప్రకారం ఈ నెల 10న అర్ధరాత్రి గౌస్ పాషా కరీం ఇంటికి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం హత్యకు ఉపయోగించిన వస్తువులను గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పడేసి వెళ్లినట్లు విచారణలో వెల్లడైందన్నారు. కేసులో నిందితులైన సలీమా బేగం, గౌస్ పాషాలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి కానిస్టేబుల్ ఉన్నారు.
Also read: తెలంగాణ విద్యుత్ వాడకంలో సరికొత్త హిస్టరీ.. అత్యధిక వినియోగం అక్కడే?