New CS For Telangana: తెలంగాణ కొత్త సీఎస్గా(New CS) ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం నిన్న జారీ చేసింది. సీఎస్గా ఉంటూనే ఆర్థికశాఖ పదవిలోనూ అదనపు బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది. సీఎస్ రేసులో ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ.. పని తీరు ఆధారంగా ప్రభుత్వం రామకృష్ణారావు వైపే మొగ్గు చూపింది.
1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు నంద్యాలలో పుట్టారు. ఐఐటీ కాన్పుర్లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేశారు. అమెరికా డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సబ్కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా పని చేశారు. గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్గా, విద్యాశాఖ కమిషనర్గా, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ విభజన ప్రక్రియలో ఆయన చురుగ్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా చేరి ఇప్పటివరకూ అదే పొజిషన్ లో ఉన్నారు. పుష్కరకాలంగా ఆర్థికశాఖ అధిపతిగా పనిచేసిన ఆయన మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లను తయారు చేశారు. ఇందులో 12 పూర్తిస్థాయి బడ్జెట్లు, రెండు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లు ఉన్నాయి.
పురపాలకశాఖ కార్యదర్శి పోస్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. HMDA పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్కు ఇలంబర్తి, HMDA బయట ఉన్న మున్సిపాలిటీలకు టీకే శ్రీదేవి పురపాలకశాఖ కార్యదర్శులుగా నియమితులయ్యారు.
సుదీర్ఘకాలంగా ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్ను సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగానికి కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేసింది. స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ విభాగానికి కూడా ఆయనను సీఈవోగా ఉంటారు. ఇక క్రీడలు, యువజన విభాగం, ఆర్కియాలజీ విభాగాలకు అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. సీఎంఓలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న సంగీత సత్యనారాయణను వైద్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా మార్చింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులు చేపట్టింది. యువజన శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ను రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా పంపింది. స్మిత సభర్వాల్ గతంలో ఈ పోస్టులో పని చేశారు.
Also Read: మళ్లోచ్చేది బరాబర్ నేనే చూసుకోండ్రి.. కేసీఆర్ ఊరమాస్ స్పీచ్..
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. గత కొంత కాలంగా స్మిత వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. అంతే కాదు స్మితను విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో ఆమెను బదిలీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.