Cyber Crime: కొత్త సంవత్సరం (New Year 2026) వేడుకల వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలో.. వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న నకిలీ గ్రీటింగ్స్ , ఆఫర్ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా మనకు తెలిసిన వారి నుంచే ‘న్యూ ఇయర్ గిఫ్ట్’ లేదా ‘భారీ డిస్కౌంట్ ఆఫర్’ పేరుతో లింకులు వస్తుంటాయి. వీటిని క్లిక్ చేయగానే.. యూజర్లకు తెలియకుండానే ఫోన్లో మాలిషియస్ APK (Malicious APK) ఫైల్ సైలెంట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్రమాదకరమైన యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్పై పూర్తి నియంత్రణ సాధిస్తారు. మీ ఫోన్కు వచ్చే OTPలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వారు సులువుగా దొంగిలిస్తారు.
ఈ స్కామ్లో మరో ప్రమాదకరమైన కోణం ఏమిటంటే.. ఒకరి ఫోన్ హ్యాక్ అయిన తర్వాత.. బాధితుడి పేరుతోనే వారి కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూపులకు ఈ స్కామ్ మెసేజ్లు ఫార్వర్డ్ అవుతాయి. దీనివల్ల పంపిన వారు మనకు తెలిసిన వారే కదా అని నమ్మి ఇతరులు కూడా ఆ లింక్ క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా గొలుసుకట్టుగా ఈ సైబర్ నేరం వ్యాపిస్తోందని పోలీసులు గుర్తించారు.
సైబర్ దాడుల నుండి రక్షణ పొందడానికి పోలీసులు సూచనలు చేశారు. ‘వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే అనధికారిక డిస్కౌంట్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్లను (APK) ఇన్స్టాల్ చేయకూడదు. మీ వాట్సాప్ ఖాతా భద్రత కోసం వెంటనే ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ ఫీచర్ను ఆన్ చేసుకోవాలి. గ్రూపుల్లో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు’ అని పోలీసులు తెలిపారు.
ఒకవేళ మీరు పొరపాటున ఇటువంటి లింకులు క్లిక్ చేసి సైబర్ మోసానికి గురైతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.
ALSO READ: Ibomma Ravi: చివరకు స్నేహితుల ఐడీలను కూడా..? ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు