Husband Murder: భర్తతో ఏడడుగులు నడిచిన భార్య.. వివాహేతర సంబంధం మోజులో పడి, కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతడినే కడతేర్చింది. ఈ ఘటన నిజామాబాద్లో కలకలం రేపింది. పల్లటి రమేష్ మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇది సహజ మరణం కాదని, భార్య సౌమ్య తన ప్రియుడు దిలీప్తో కలిసి చేసిన పక్కా ప్లాన్ మర్డర్ అని తేల్చారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు పల్లటి రమేష్ పేరిట సుమారు రూ. 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన రమేష్ భార్య సౌమ్య.. ఆ డబ్బును ఎలాగైనా దక్కించుకోవాలని దురాశ పెంచుకుంది. మరోవైపు దిలీప్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. భర్త అడ్డు తొలగించుకుంటే.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోవాలని ప్లాన్ వేసింది.
ముందుగానే చేసుకున్న ప్లాన్ ప్రకారం.. రమేష్కు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకునేలా చేశారు. అనంతరం సౌమ్య, దిలీప్ కలిసి రమేష్ గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. అతనికి గుండెపోటు వచ్చిందని, అందుకే చనిపోయాడని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేశారు. సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.
కానీ, ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. రమేష్ మృతిపై అతని సోదరుడికి అనుమానం వచ్చింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని రమేష్కు హఠాత్తుగా గుండెపోటు రావడం, వదిన ప్రవర్తనలో తేడా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో సౌమ్యను, దిలీప్ను విచారించగా అసలు నిజం కక్కారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Read Also: దొంగకు నరకయాతన.. చోరీకి వచ్చి ఇలా చిక్కుకుపోయాడు, చివరికి..