రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. కేబినెట్ విస్తరణతో పాటే ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ మరో కొత్త విషయం రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. అయితే, వాటికోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నామని, తమకు చాన్స్ ఇవ్వాలని పలువురు జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందో అని అధికార పార్టీలో చర్చ జరుగుతున్న వేళ.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన అనంతరం కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో పలువురిలో కొత్త ఆశలు చిగురించాయి.ఇంతకాలం మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న వారంతా ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈసారి చాన్స్ ఇవ్వకపోతే అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సైతం రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఈసారి అట్టడుగు వర్గాల వారికి మంత్రి పదవి దక్కనుందని సమాచారం. అందుకే వారంతా ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా లాబీయింగ్ మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పదవులు రాని వారికి ఈసారి చాన్స్ ఉందని తెలుస్తుండగా.. మరోవైపు ఇప్పటికే మంత్రిగా రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం పంచుకుంటున్న నేతలు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న మంత్రివర్గంలో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని ఒక్కొక్కరికి రెండు పోర్టుఫోలియాలు అప్పగించగా వారు పనిచేయకపోగా.. సర్కారుకు చెడ్డపేరు తీసుకొచ్చేలా బిహేవ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఈ క్రమంలోనే ఇద్దరు లేదా ముగ్గురి మంత్రి పదవులు పోతాయని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పలువురి మంత్రుల శాఖలు కూడా మారుతాయని తెలుస్తోంది.ఈ విషయం తెలియగానే కొందరు మంత్రులు తన శాఖ ఉంటుందా? లేదా? మంత్రి పదవి ఉంటుందా? పోతుందా? అని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు తన కుర్చీ కిందకు నీళ్లు వస్తాయా?అని ఇప్పటినుంచే ఎంక్వైరీలు చేయడంతో పాటు కుర్చీని ఎలా కాపాడుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
విశాఖ–నరసాపురం రూట్ లో రైళ్లు నడపండి, కేంద్రానికి DRUA డిమాండ్!
ప్రస్తుతం సీఎం రేవంత్ హిట్ లిస్టులో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది.వారిలో నుంచి ఒకరి పదవి మాత్రం పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో ఒకరు బీసీ మంత్రి, మరొకరు ఎస్సీ మంత్రి ఉన్నారు.వీరిద్దరిలో ఒకరిది మాత్రం తప్పకుండా పోయే చాన్స్ ఉందని తెలుస్తోంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రి పదవులు కూడా పోతాయని తెలుస్తోంది. వీరి స్థానాల్లో కొత్తవారికి చాన్స్ ఇస్తారని.. ఖాళీగా ఉన్న రెండు పోస్టులు సైతం భర్తీ చేసి తొలిసారిగా పూర్తి స్థాయి కేబినెట్ కోసం రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పదువులు పొగొట్టుకునే వారి మీద అవినీతి ఆరోపణలు, కాంట్రవర్సీ, సర్కారుకు చెడ్డపేరు తీసుకురావడంమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.