Operation Smile: స్వేఛ్చ బ్యూరో: నెల రోజులపాటు జరిపిన ఆపరేషన్ స్మైల్లో భాగంగా మహిళా భద్రతా విభాగం సిబ్బంది 5,582మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు నేపాల్ దేశానికి చెందిన 43 చిన్నారులు ఉన్నారు. నిరుపేద కుటుంబాలను టార్గెట్ గా చేసుకుంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు పెద్దలకు కొంత డబ్బు ఇచ్చి చిన్నపిల్లలను రాష్ట్రాలు దాటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తీసుకు వచ్చిన వారిలో మగ పిల్లలను ఇటుక బట్టీలు, గాజులు, ప్లాస్టిక్ పరిశ్రమలు, దాబాల్లో పనికి పెడుతున్నారు. ఆడపిల్లలలను ఇళ్లల్లో పనికి కుదిరిస్తున్నారు. మరికొందరితో భిక్షాటన చేయిస్తున్నారు. ఇలాంటి పిల్లలను రక్షించటం కోసం ప్రతీ ఏటా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగానే రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ చారు సిన్హా(DGP Charu Sinha) గతనెల 1న రాష్ట్రంలో ఆపరేషన్ స్మైల్ను ప్రారంభించారు. గత నెల 31వ తేదీ వరకు కొనసాగిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్రం మొత్తం మీద 605మంది పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన 121 సబ్ డివిజనల్ బృందాలు పాల్గొన్నాయి. మహిళా శిశు సంక్షేమ, కార్మిక, ఆరోగ్య శాఖలతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో తనిఖీలు జరిపాయి. దీనికి ముందు డిసెంబరు 29న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో జువైనల్ జస్టిస్ యాక్ట్, బాల కార్మిక నిరోధక చట్టాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇక, ఆపరేషన్ మొదలైన తరువాత ఈ ప్రత్యేక బృందాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీ స్టాళ్లు, దాబాలతోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో వెట్టి చాకిరీలో మగ్గుతున్న 5,108 మంది బాలురు, 474 మంది బాలికలను సిబ్బంది రక్షించారు. వీరిలో 2,292 మంది బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 15 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు డీజీపీ చారు సిన్హా వెల్లడించారు. పొరుగు దేశమైన నేపాల్కు చెందిన మరో 43 మంది చిన్నారులను కూడా రక్షించినట్లు తెలిపారు. రక్షించబడిన వారిలో 4,567 మంది బాల కార్మికులుగా, 486 మంది వీధి బాలలుగా, 38 మంది భిక్షాటన చేస్తూ, మరో 491 మంది ఇతర పనుల్లో మగ్గుతూ దొరికారని పేర్కొన్నారు.
Also Read: Jr NTR: అల్లు అర్జున్ వదులుకున్న కథతో ‘తారక్’ హిట్ కొడతాడా?.. నెల్సన్ తర్వాత గురి ఎన్టీఆరేనా?
చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకున్న వారి పట్ల కఠన చర్యలు తీసుకున్నట్టు డీజీపీ చారు సిన్హా తెలిపారు. ఇందులో భాగంగా 1,480 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి 1,483 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కార్మిక శాఖ ద్వారా 1,363 తనిఖీ నివేదికలు జారీ చేయించి కనీస వేతనాల చట్టం కింద నిందితులకు రూ. 41.78 లక్షల జరిమానా విధించామన్నారు. రక్షించిన వారిలో 4,978 మంది చిన్నారులను వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని తెలిపారు. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేక పోయిన 604మంది చిన్నారులను రక్షణ గృహాలకు తరలించినట్టు వివరించారు. ఇక, వలస కార్మికుల కుటుంబాలకు చెందిన 2,375మంది పిల్లలను 29 అర్భన్ బ్రిడ్జ్ స్కూళ్లలో చేర్పించినట్టు చెప్పారు. బాలల అక్రమ రవాణా, వెట్టిచాకిరీని నిర్మూలించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇక, ఆపరేషన్ స్మైల్ లో భాగంగా సైబరాబాద్ ఉమెన్, చైల్డ్ సేఫ్టీ వింగ్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ జరిపి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 110 కేసులు నమోదు చేశారు. 352 మంది చిన్నపిల్లలను కాపాడారు. వీరిలో 340మంది బాలురు, 12మంది బాలికలు ఉన్నట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో షీ టీం బృందాలు 5,821మందికి మానవ అక్రమ రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, భిక్షాటన వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, సైబర్ మోసాలపై కూడా అవేర్ నెస్ కల్పించినట్టు తెలిపారు. మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, డయల్ 100, సైబర్ బాధితుల కోసం 1930 నెంబర్ల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించామన్నారు.