Panchayat Raj: తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖలో పాలన ముందుకు సాగడం లేదని ప్రచారం జరుగుతుంది. శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిషనరేట్ స్థాయిలోనే కీలకమైన ఫైళ్లు వారాల తరబడి పెండింగ్లో పడ్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారికి మరో రెండు కీలక శాఖలు ఉండటంతోనే పూర్తి స్థాయిలో ఈ శాఖపై దృష్టిసారించడం లేదనే ప్రచారం జరుగుతుంది. సంతకం కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు.
గత రెండు నెలల వరకు పంచాయతీరాజ్ శాఖలో పాలన చకచక జరిగేది. అప్పుడు పూర్తిస్థాయి కమిషనర్ గా సృజన ఉండటంతో, ఆమెకు ఒకే శాఖను ప్రభుత్వం అప్పగించింది. దీంతో శాఖలోని పనులన్నీ వేగంగా జరిగేవి. అయితే ప్రభుత్వం బదిలీలో భాగంగా ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ వెంటనే మహిళాశిశు సంక్షేమశాఖ కమిషనర్ శృతి ఓజాకు పంచాయతీరాజ్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమె సుమారు 15 రోజులకు పైగా పనిచేసింది. అయితే శాఖపై పూర్తి స్థాయిలో పట్టురాకపోవడంతో పైల్స్ అన్ని పెండింగ్ లో పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ కమిషనర్గా దివ్యకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సుమారు నెలన్నర కావస్తుంది. అయినప్పటికీ పైల్స్ మాత్రం ముందుకు సాగడం లేదని సమాచారం. దివ్య ప్రస్తుతం పంచాయతీరాజ్ కమిషనర్గా, సెర్ప్ సీఈవోగా, ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూడు కీలకమైన శాఖలకు ఒకే అధికారి ఉండడం, పనిభారం పెరిగిపోవడమే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుతం ఫైల్స్ కమిషనర్ లాగిన్లో పెండింగ్లో ఉండడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు, సర్పంచులు వాపోతున్నారు.
Also Read: Seethakka: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క
సర్పంచ్ ఎన్నికలకు ముందు ఉపాధి హామీ కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లుల చెల్లింపు ఫైల్స్ పెండింగ్ పెట్టారు. అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లకు సంబంధించిన ఫైల్స్ సైతం క్లియర్ కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల డిప్యూటేషన్ ఫైల్స్ కూడా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిర్వహణ నిధుల విడుదలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్స్ సైతం ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం కోసం ఈ- ఆఫీస్ విధానం తెచ్చారు.. కానీ, ఫైల్ డిజిటల్గా ఉన్నా.. దానిని పరిశీలించి, డిజిటల్ సంతకం పెట్టి అప్రూవ్ చేయాల్సింది కమిషనరే. ప్రస్తుతం కమిషనర్ దివ్యకు సెర్ప్, ప్రజావాణి బాధ్యతలు ఉన్నాయి. దీంతో ఆమె ఎక్కువగా సెర్ప్, ప్రజావాణిపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పీఆర్ ఫైల్స్ పెండింగ్పడ్తున్నాయని శాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే పంచాయతీరాజ్ శాఖ పనితీరును బట్టే వస్తుంది. గ్రామాల్లో చేసే అభివృద్ధి పనులు, వాటికి ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ జాప్యం జరుగుతుండటం.. ఇదే కొనసాగితే నెగిటీవ్ ప్రచారం జరిగే అవకాశం లేకపోలేదు. అదే విధంగా ఉపాధిహామీ కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన ఏజెన్సీలకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లుల చెల్లింపు ఫైళ్లు, పంచాయతీరాజ్విభాగంలో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లకు సంబంధించిన ఫైళ్లు , డిప్యూటేషన్ ఫైళ్లు, పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిర్వహణ నిధుల విడుదలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్స్ కు సంబంధించిన ఫైళ్లు ఇలా సుమారు 30 కి పైగా ఫైళ్లు డైరెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖపై దృష్టిసారించి పూర్తిస్థాయి కమిషనర్ ను నియమిస్తేనే పాలన ముందుకు సాగుతుందని, ప్రభుత్వానికి పేరు వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక ఇన్ చార్జులతోనే పంచాయతీరాజ్ శాఖను కొనసాగిస్తుందా? అనేది చూడాలి.