Seethakka: తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రికి అందజేయగా, వాటిలో పలు మార్పులు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రూపాయి కూడా లాప్స్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటాను తప్పకుండా సాధించాలని అన్నారు. కేంద్రానికి రాష్ట్రం భారీగా పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా సాధించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తే అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవసరమైన యుటిలిటీ సర్టిఫికేట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదల చేయించాలన్నారు.
ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశ పెట్టిన వీబీ జీ రాం జీ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధీ కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శాఖలోని అన్ని విభాగాలు తమ ప్రగతి నివేదికలను క్రమం తప్పకుండా రూపొందించాలని ఆదేశించారు. జల సంరక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధంగా అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచాలన్నారు. 99 డేస్ ప్రణాళికల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి ఈ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు ఉపాధి,స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ, ఏజెన్సీ మరియు గిరిజన ప్రాంతాల్లో అనేక వాగులు ఉన్నప్పటికీ వేసవికాలంలో సాగు మరియు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్నందున వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాగులు, వంకలు, తోగులపై చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, శాఖకు చెందిన అన్ని విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు.
Also Read:Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజయం వెనుక అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?