Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల బిల్లు మంజూరు కోసం లబ్ధిదారు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఐజ మండలం ఏక్లాస్ పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి రంగన్న ఆ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారురాలి బిల్లు మంజూరుకు 4 విడతలకు ఒక్కో విడత చొప్పున 5 వేలు డిమాండ్ చేశాడు. లబ్ధిదారురాలి భర్త అభ్యర్థన మేరకు 15 వేలకు ఒప్పుకున్నాడు. మొదటి విడతలో 5 వేలతో పాటు మిగతా మూడు విడుతలకు నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
Also Read:Viral Video: వ్యూస్ కోసం వెర్రి వేషాలు.. స్కూటీ డిక్కీలో పసిపాప, ఈ కిలాడీ లేడీ చేసిన పని చూస్తే…?
ఈ మేరకు ఐజ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారు నుంచి సెక్రటరీ నగదు స్వీకరించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుడి రెండు చేతి వేళ్లకు, అతను ధరించిన ప్యాంటు యొక్క ఎడమ వైపు ముందు జేబు లోపలి భాగానికి రసాయన పరీక్ష నిర్వహించగా, సానుకూల ఫలితాలు వచ్చాయి. నిందితుడు ధరించిన ప్యాంటు యొక్క ఎడమ వైపు ముందు జేబు నుండి లంచం మొత్తం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064తో పాటు ఇతర సోషల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.