Sarpanch Election : సిద్దిపేట అర్బన్ మండలానికి చెందిన పాండవపురం గ్రామంలో.. సర్పంచ్ ఎన్నికలపై నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర కలకలం రేపాయి. గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా చేసుకోవాలనే ఉద్దేశంతో.. గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన వేలంపాట వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని గుర్తించిన త్రీ టౌన్ పోలీసులు చురుకుగా స్పందించి.. మొత్తం 35 మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గ్రామం అభివృద్ధి, ఐకమత్యం పేరుతో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలని.. పాండవపురం పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఏకగ్రీవం ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం కాకుండా ఎవరు ఎంత మొత్తం ఇస్తే వారికి అవకాశం అన్న తరహాలో సాగింది. గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఈ వేలంపాటలో అందె శంకరయ్య అనే వ్యక్తి.. 16 లక్షల రూపాయలు పాట పాడి సర్పంచ్ పోస్టుకు తన నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామ పెద్దలు ప్రకటించిన నిబంధనల ప్రకారం.. శంకరయ్య నామినేషన్ వేసిన తర్వాత గ్రామంలో మరెవరూ పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు కూడా అంగీకరించినట్లు సమాచారం.
అయితే ఈ నిర్ణయం తర్వాత ఊహించని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామానికి చెందిన బైరి రాజు అనే వ్యక్తి తొలుత ఏకగ్రీవ నిర్ణయానికి సహకరించినప్పటికీ, తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకొని స్వతంత్రంగా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు.
రాజు నామినేషన్ వేయడం గ్రామ పెద్దలకు, వేలంపాటలో పాల్గొన్నవారికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఏకగ్రీవాన్ని ధ్వంసం చేశాడని కొంతమంది గ్రామస్తులు రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన సమావేశాల్లో రాజును తీవ్రంగా ప్రశ్నించడమే కాకుండా, అతన్ని కుల బహిష్కరణ చేయాలనే దిశగా కూడా గ్రామ పెద్దలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవానికి ఆటంకం కల్పించాడని ఆరోపిస్తూ కొందరు గ్రామస్తులు.. రాజు ఇంటి వద్దకు వెళ్లి అతనిని బెదిరించినట్లు తెలిసింది. రాజు భయాందోళనకు గురై పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విషయం తెలుసుకున్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గ్రామ సమావేశాల్లో జరిగిన సంభాషణలు, రాజుపై మౌఖిక బెదిరింపులు, ఏకగ్రీవానికి బలవంతంగా ప్రయత్నించిన ఆధారాలతో.. పోలీసులు మొత్తం 35 మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు.
Also Read: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే ముమ్మర ప్రచారం
అంతేకాకుండా, ఘటనలో ఉపయోగించినట్లు భావించిన 9 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి ప్రయత్నించారని పేర్కొంటూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.