Sonia Gandhi: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’పై ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సమ్మిట్ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె ఒక లేఖ కూడా విడుదల చేశారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఈ సమ్మిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలసిన వారికి ఒక వేదిక అందిస్తుందని సోనియా గాంధీ తెలిపారు. తెలంగాణ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ-వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో ముందుకు సాగుతోందనే విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణలో ఉన్న మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి ఈ సమ్మిట్ ఎంతో గానూ తోడ్పడుతుందని సోనియా గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. సమ్మిట్లో పాల్గొనే వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశ లభిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. దావోస్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించనున్న ఈ సమ్మిట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారు.
ALSO READ: Messi – CM Revanth Reddy: మెస్సీ హైదరాబాద్ మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సీఎం రేవంత్ రెడ్డి