Jana Sena: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోనూ తమ పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనానీ రెడీ అయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన జనసేనాని, ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు, టికెట్ దక్కని ఎమ్మెల్యే ఆశావహులకు జనసేన గాలం వేస్తోంది.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖ నేతలతో పాటు, ఈసారి ఎలాగైనా బరిలోకి దిగాలని భావిస్తున్న కొత్త లీడర్లపై జనసేన అధిష్ఠానం కన్నేసింది. వివిధ పార్టీల్లో ప్రాధాన్యత దక్కక, అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. జనసేనాని ఇమేజ్, యువతలో ఉన్న క్రేజ్ తమకు కలిసి వస్తుందని భావిస్తున్న పలువురు నేతలు కూడా గాజు గ్లాస్ వైపు చూస్తున్నారు. పైగా యువతరానికి ఈ పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. దీంతో జాయినింగ్స్ కు కొందరు మొగ్గు చూపుతుండటం విశేషం.
తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు, వారి అనుచరులు జనసేన గూటికి శుక్రవారం చేరనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో భారీ ఏర్పాట్లు చేశారు. వరుసగా రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికల పర్వం కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయాలపై ఆసక్తి కలిగి, పబ్లిక్ కు సేవ చేయాలని భావిస్తున్న యువ నాయకులకు తెలంగాణలో మరో రాజకీయ ప్లాట్ ఫామ్ ను మరింత వేగంగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో జాయినింగ్స్ అత్యధికంగా నిర్వహిస్తామని, మెంబర్షిప్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని జన సేన నాయకులు వివరిస్తున్నారు.
Also read: బడ్జెట్ ధరలో ఇల్లు ‘స్మార్ట్’.. రూ.5,000లోపు దొరికే టాప్-5 గ్యాడ్జెట్స్ ఇవే!
మరోవైపు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు గానూ, శుక్రవారం ఉదయం హైదరాబాద్లో జనసేన నూతన పార్టీ కార్యాలయాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ను ప్రకటించనున్నారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలి? ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యచరణను ఆయన క్యాడర్కు వివరించనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీల్లో అసెంబ్లీ స్థానాల్లో ఆలెడ్రీ ఎమ్మెల్యేలు , ఇన్ చార్జ్ లుగా ఉన్నారు. వీటిలో ఒక్కో పార్టీ నుంచి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు కీలక నేతలు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ప్రజల్లోనూ పనిచేస్తున్నారు. దీంతో కొత్త నాయకులు, ముఖ్యంగా యువతారానికి అవకాశాలు వస్తాయా? రావా? అనే డైలమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సేవల చేయాలని సంకల్పంతో ఉన్న యువ నాయకులను గాలం వేసి పార్టీని బలోపేతం చేయాలని జనసేన ట్రై చేస్తున్నది. పైగా గత కొన్ని రోజులుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పర్యటనలు మొదలు పెట్టారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ తర్వాత మరింత విస్తృతంగా జనాల్లోకి తిరుగుతామని జన సేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!