రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే షురూ అయినయ్.. పొద్దు పొద్దున్నే ఎండలు దంచికొడుతున్నయ్.. మార్చి మొదటి వారంలోనే భానుడ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ నెలలో కనిపించే వేడి ఈ ఏడాది మార్చిలోనే జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో కూడా భానుడి సెగలు తీవ్రంగా ఉంటాయని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36°C నుంచి 40°C వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పటికీ గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు వేడి గాలుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
ఎండల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి. బయటకు వెళ్లేటప్పుడు శరీరానికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోవాలి. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఎండలో ప్రయాణించాల్సి వస్తే టోపీ, సన్ గ్లాసెస్ కచ్చితంగా వాడాలి. డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండటానికి దాహం వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండడం మంచింది. ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత గరిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు వాయిదా వేసుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. బయట లభించే శీతల పానీయాల కంటే ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎండ ప్రభావం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త అవసరం. తల తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ALSO READ: Today Gold Rate: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?