PMFBY Insurance: సరిగ్గా పంట చేతికొస్తుందన్న సమయంలో అకాల వర్షాలు.. తీవ్రమైన పంట నష్టం కలిగిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అనే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్ ప్రారంభానికి ముందు ఈ పథకం కింద రైతులు తమ పంటకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రీమియంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అందిస్తున్నాయి. అయితే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్న రైతులు.. ఒకవేళ పంట నష్టపోతే ఏం చేయాలి, ఎంత సమయంలో తమ పంట నష్టాన్ని రిపోర్ట్ చేయాలో, ఇతర ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వానలు, ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో.. పంట కోతకు దగ్గరలో ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా చేసుకున్న రైతులు.. పంట నష్టం జరిగిన డెబ్బై రెండు గంటలలోపు ఆ నష్టాలను రిపోర్టు చేయాలి. అలా చేస్తేనే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పంటలు, పండ్ల తోటలు, కూరగాయల పొలాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
PMFBY ప్రకారం.. వడగళ్ల వాన, కొండచరియలు విరిగిపడటం, వరదలు లేదా క్లౌడ్ బరెస్ట్ వంటి ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు బీమా చేయించుకున్న రైతులు..72 గంటలలోపు అధికారులకు సమాచారం ఇవ్వాలి. బ్యాంకు ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నా లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రీమియం చెల్లించినా.. ఏ విధంగా తీసుకున్న 72 గంటల నిబంధన వర్తిస్తుంది. రైతులు తమ పంట నష్టాలను 72 గంటలలోపు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14447 లేదా సంబంధిత బీమా కంపెనీ కాల్ సెంటర్, బ్యాంకు శాఖ, లేదా స్థానిక వ్యవసాయ లేదా రెవెన్యూ అధికారులకు రిపోర్టు చేయాలి. అధికారులు ఆ నివేదికను 48 గంటలలోపు అంచనా కోసం బీమా కంపెనీకి పంపాలి.
బీమాపై రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే.. కృషి రక్షక్ హెల్ప్లైన్ 14447 ద్వారా ఫిర్యాదులు, ప్రశ్నలను నమోదు చేయవచ్చు. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ 1800‑180‑1551 ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రాథమిక సమాచారాన్ని అందిస్తారు. HDFC ERGO, SBI జనరల్తో సహా అనేక బీమా సంస్థలు తమ వెబ్సైట్లలో PMFBYకి ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నంబర్లను అందిస్తున్నాయి.
Also Read: రైతుల ఖాతాల్లో రూ.6 వేలు, ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ టాప్ 6 సంక్షేమ పథకాలివే
వడగండ్లు లేదా ఉరుములతో కూడిన వర్షం వల్ల పంట నష్టం జరిగితే.. బీమా చేయించుకున్న రైతు, పొలం, పంట నష్టం స్పష్టంగా కనిపించేలా ఫొటో తీయాలి. రైతు పేరు, బీమా చేసిన పొలం సర్వే నంబర్, బీమా చేసి పంట, PMFBY రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా పేర్కొనాలి. వెరిఫికేషన్ వేగంగా పూర్తి అవ్వడానికి పంటల బీమా యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫొటోలను ఉపయోగించాలి. పంట నష్టం జరిగిన 72 గంటల్లోపు ఈ వివరాలు నమోదు చేయకపోతే.. నష్టపరిహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సకాలంలో, సరైన పత్రాలతో సమాచారం అందించడం వల్ల క్లెయిమ్ వేగంగా పరిష్కారమవుతుంది.