Mancherial News: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పోడు భూముల సమస్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూముల సమస్యల పరిష్కారం కోసం లక్సెట్టిపేటలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన రైతులను అదుపులోకి తీసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రయత్నించడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది.
అధికారులు తమను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంపై పోడు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడిన రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పోడు రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి తోపులాట జరిగే స్థాయికి చేరడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
అటవీ భూముల పరిరక్షణ పేరుతో అధికారులు తమ సాగు భూములను అక్రమంగా తీసుకుంటున్నారని దమ్మన్నపేట పోడు రైతులు తీవ్రంగా ఆరోపించారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం తమ జీవనాధారాన్ని దెబ్బతీయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
తమ సమస్యలపై అటవీ శాఖ అధికారులు కఠిన వైఖరి అవలంబించడంపై గ్రామస్థులు, రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సమస్యపై ప్రజా ప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకొని, రైతులకు న్యాయం జరిగేలా శాశ్వత పరిష్కారం చూపించాలని పోడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోడు రైతుల ఆందోళనతో లక్సెట్టిపేట అటవీ కార్యాలయం వద్ద కొంత సమయం పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ALSO READ: RRB JE: బంగారం లాంటి ఉద్యోగాలు భయ్యా.. ఎప్పుడో ఓసారి పడే నోటిఫికేషన్.. లైఫ్ సెట్ అంతే