New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల జోష్ మొదలైన వేళ, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వేడుకల పేరుతో హద్దు మీరి ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత పెడదారిన పడకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే వెంటనే అదుపులోకి తీసుకునేలా క్విక్ రెస్పాన్స్ టీమ్లను రంగంలోకి దించారు.
మందుబాబులపై ప్రత్యేక నిఘా..
వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసులు తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని ఆదేశించారు. ఇండోర్ వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతి ఉన్నప్పటికీ, శబ్దం 45 డెసిబుల్స్ మించకూడదని పేర్కొన్నారు. రోడ్లపై, కూడళ్లలో గుమికూడి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే ఈవెంట్ ఆర్గనైజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్స్ టెస్ట్ కిట్లతో రంగంలోకి ఈగల్ టీమ్
మరోవైపు ఈసారి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్పై సీరియస్గా దృష్టి పెట్టారు. డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానాతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష అమలు చేస్తారు. ప్రతి వాహనదారుడిని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించడమే కాకుండా, అనుమానం వస్తే రక్త పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
తల్లిదండ్రులకూ పోలీసుల హెచ్చరిక!
ఇక మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానిదే పూర్తి బాధ్యతగా హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, సైలెన్సర్లు తొలగించి శబ్ధాలు చేస్తే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేయనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అర్థరాత్రి వేళ వాహనాలతో బయటకు పంపవద్దని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. యువత బైక్ రేసింగ్లకు పాల్పడితే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా ఈసారి కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. డీసీఎం దగ్ధం, డ్రైవర్ సజీవ దహనం
అంతేకాకుండా భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కీలక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ రంగంలోకి దిగుతున్నాయి. వేడుకల్లో అసభ్యకర ప్రవర్తన లేదా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఐటీ హబ్లు, పబ్లిక్ పార్కులు, మాల్స్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100 లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి నూతన సంవత్సరానికి క్షేమంగా ఆహ్వానం పలకాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్
శాంతిభద్రతల కోసం పోలీస్ బందోబస్తు
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో ప్రత్యేక ఏర్పాట్లు
రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ముమ్మరం
గుంపులుగా రోడ్లపై తిరగొద్దని పోలీసుల సూచన
పబ్లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల నిఘా… pic.twitter.com/KyKJzKXjyJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు: సీపీ సజ్జనార్
హైదరాబాద్ లో 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది
మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు, జైలు… pic.twitter.com/Kl9pDI5ovK
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025