తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గులాబీ బాస్ 8 నెలల విరామం తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. వస్తే వచ్చారు కానీ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పటిలాగే వచ్చారు మళ్లీ వెళ్లి ఫాంహౌస్కే పరిమితం అవుతారు కదా? అని అంతా భావించారు. కానీ ‘రెండేళ్లుగా చూస్తూ ఉన్నా ఇక ఊరుకునేది లేదని,ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క’ అంటూ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.కేసీఆర్ అలా మాట్లాడేసరికి రాష్ట్ర రాజకీయం ఒక్క రాత్రిలోనే మారిపోయిందా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఆయన ఒకేసారి కార్నర్ చేశారు.
కేసీఆర్ మాటల్లో ఒకింత అసహనం, ఒకింత కోపం కనిపించినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆయన మాటల్లో ప్రభుత్వం ఏమి చేయడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఆవేదన.. తాము ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం ఏంటి? కృష్ణా నదీ జలాల్లో తాము 90.18 టీఎంసీలు సాధిస్తే 45 టీఎంసీలు చాలని ఈ సర్కార్ బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అంగీకరించడం ఏంటని నిలదీశారు. ఏపీ జలదోపిడీకి కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపించడంలో అర్థం ఏంటి? ఈ విషయాన్ని ఎందుకు దాచారు? అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లి కొట్లాడాలి కదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో కొందరు నేతల నుంచి నా చావు మాట తప్పా ఏమీ రావడం లేదని, ఇదేనా మీ రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు.ఇకపై ప్రజల పక్షాన తానే కొట్లాడుతానని, రాబోయే రోజుల్లో భారీ బహిరంగసభలు నిర్వహిస్తానని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఉపఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేసిందనే భావనకు కేసీఆర్ వచ్చారని.. ప్రస్తుతమున్న రాష్ట్ర నాయకత్వం పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. అందుకే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేసీఆర్ తన టాక్టిక్స్ వాడుతున్నారని.. నదీ జలాలపై ప్రభుత్వ వైఫల్యాలను బూచిగా చూపి పార్టీ గ్రాఫ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కేసీఆర్ ఆరోపణలు, విమర్శలపై సీఎం రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడు కేసీఆర్ చావు కోరలేదని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇంతకాలానికి ఆయన బయటకు రావడం సంతోషకరమని.. ఇప్పటివరకూ నదీ జలాలపై ఆయన చేసిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చజరుపుతామని..కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అని సవాల్ విసిరారు. నిజంగా కేసీఆర్ చెప్పేవి నిజాలైతే సీఎం ఆహ్వానాన్ని మన్నించి అసెంబ్లీకి వచ్చి సమగ్ర చర్చ జరిపితే ఎవరు కరెక్ట్.. ఎవరు రాంగ్ అనేది తెలిసిపోతుంది.మరి రేవంత్ సవాల్ను కేసీఆర్ స్వీకరిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. సభల్లో మాట్లాడే బదులు అసెంబ్లీలో మాట్లాడితే బెటర్ కదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.