Srinivasa Reddy: స్వేచ్ఛ బ్యూరో: సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని, ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఫామ్ హౌజ్ నాయకులకు పేదల గురించి ఏం తెలుస్తుందని మండిపడ్డారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారన్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని మే 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు కు బుద్ధి చెబుతామని కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి చురకలు అంటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి, లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్ ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదన్నారు. ఈ సవాల్కు సిద్ధమేనా కేటీఆర్ ? అంటూ మంత్రి ఛాలెంజ్ చేశారు.
Also Read: రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్