Ponnam Prabhakar: దేశంలో ఓట్ల తొలగింపు, ప్రజాస్వామ్య విలువల పతనంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోరీ’ వ్యతిరేక ర్యాలీలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుతం బీజేపీకి ఒక అనుబంధ సంఘంగా మారిపోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలమని, ఓట్ల తొలగింపు విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పొన్నం పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఓట్లను తొలగించకుండా సరైన విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. కేవలం అధికారం చేజిక్కించుకోవడం కోసమే బీజేపీ నాయకులు శ్రీరాముడి పేరును, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా ఢిల్లీకి తరలివచ్చారని మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, మంత్రులందరూ ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ఓట్ల గల్లంతుపై ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను ఈ సందర్భంగా అందజేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: Mahesh Kumar Goud: అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. కేబినెట్ మార్పులపై మహేష్కుమార్ గౌడ్