Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ మీడియా చిట్చాట్లో పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన అంశంపై స్పందించిన మహేష్కుమార్ గౌడ్, ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు.
ఈసారి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. సామాజిక సమతుల్యతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని రాజకీయ పదవులను ఒక నెలలోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
తాను రాష్ట్ర కేబినెట్లోకి వెళ్లబోతున్నానన్న ప్రచారాలపై స్పందించిన మహేష్కుమార్ గౌడ్, ఆ వార్తలను ఖండించారు. రాష్ట్ర మంత్రిగా అయ్యే ప్రసక్తే లేదని, తాను పూర్తిగా పార్టీ ప్రచారంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవితో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, రాష్ట్ర మంత్రికి లేని ప్రాధాన్యత పీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని వ్యాఖ్యానించారు.
కేసీ వేణుగోపాల్ తనను సంప్రదించారని వెల్లడించారు. పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అప్పుడే చర్చ జరిగిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై సీఎం పట్టుదలతో ఉన్నారని మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్తో ఎవరూ పోటీ పడలేని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీ ఏర్పాటు జరిగితే హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, త్వరలోనే హైదరాబాద్ ఇండియాలోనే బెస్ట్ సిటీగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేవని అన్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్ పథకం వల్ల గ్రామాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం వద్ద స్పష్టమైన విజన్ ఉందని, అదే ప్రభుత్వానికి బలమని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపై కూడా మహేష్కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మామకు దెబ్బ వేస్తాడని, ఎవరికైనా సీఎం కావాలనే ఆశ ఉంటుందని వ్యాఖ్యానిస్తూ రాజకీయ వాతావరణాన్ని చర్చనీయాంశంగా మార్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందని, అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించిందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటే కవిత బయటకు ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. కేటీఆర్ వద్ద డబ్బులు ఉన్నాయన్న కారణంతోనే సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉందని, అందుకే అనేక మంది ఇక్కడ స్థిరపడుతున్నారని చెప్పారు.
చివరగా రానున్న ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన మహేష్కుమార్ గౌడ్, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదేనని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పారు.