GHMC Ward Delimitation: హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియను చేపట్టామని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండేలా, పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని, దీనివల్ల నగరంలోని ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగి, కార్పొరేటర్లు ప్రజా సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారని మంత్రి తెలిపారు.
ముఖ్యంగా జీహెచ్ఎంసీలో విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ డీలిమిటేషన్ దోహదపడుతుందన్నారు. ప్రతి వార్డుకు జనాభా, అవసరాల ఆధారంగా నిధుల కేటాయింపు సులభతరమవుతుందని, గతంలో ఉన్న ఓటర్ల జాబితా లోపాలను సరిదిద్ది, సాంకేతికంగా పారదర్శకతను పాటిస్తున్నామని వెల్లడించారు. నీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పన ప్రణాళికాబద్ధంగా సాగుతుందని చెప్పారు. వార్డుల విస్తీర్ణం, పరిమాణం తగ్గడం వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారని, స్మార్ట్ సిటీ, మెట్రో, ఎక్స్ప్రెస్ కారిడార్ల వంటి ప్రాజెక్టుల అమలుకు ఈ డీలిమిటేషన్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు.
కాగా, ఈ నెల 14న డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిన్నటి వరకు ప్రజల నుంచి 1328 అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఈ రోజు, రేపు కూడా పౌరులు తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేదా ఆయా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో లిఖితపూర్వకంగా తెలపవచ్చని పొన్నం ప్రభాకర్ సూచించారు.
Read Also: CM Revanth : 5 నిమిషాల మ్యాచ్పై ఇంత రచ్చనా? రేవంత్కు క్రెడిట్ వస్తుందనేనా?