Ponnam Prabhakar: దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగానే.. నేడు భారత్ ప్రపంచంలో ముందంజలో నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ నిర్మాణంలో కాంగ్రెస్ చేసిన సేవలను గుర్తుచేశారు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి ఆధునిక పునాదులు వేసారని, భారీ పరిశ్రమలు, విద్యా సంస్థలు, శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఉక్కు కర్మాగారాలు, డ్యామ్లు వంటి నిర్మాణాల వల్లే దేశం స్వయం సమృద్ధి దిశగా సాగిందని పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో కీలక మార్పులకు దోహదపడ్డాయని మంత్రి అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, పేదలకు అనుకూలమైన విధానాలు, రైతులు, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలు కోట్లాది మందికి ఉపయోగపడ్డాయని వివరించారు. అలాగే రాజీవ్ గాంధీ ఆధునిక సాంకేతికతను దేశానికి పరిచయం చేసి, టెలికాం, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆ సంస్కరణల వల్లే నేడు భారత్ డిజిటల్ రంగంలో ప్రపంచానికి పోటీగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
2004లో సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు జీవనాధారం లభించిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద బలంగా నిలిచిందని చెప్పారు.
అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని.. నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడమే కాకుండా, నిధులు తగ్గించడం, పనిదినాలు పరిమితం చేయడం ద్వారా పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదలు, కూలీలకు ఉపయోగపడే ఈ పథకాన్ని దెబ్బతీయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని ప్రభావితం చేసేలా తీసుకొచ్చిన తాజా బిల్లును.. కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న పేదలపై మరింత భారాన్ని మోపినట్లవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ వైఖరిని చూపుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలబడిందని, సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలను ముందుకు తీసుకెళ్లిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశ అభివృద్ధి అంటే కొద్ది మంది సంపన్నుల ఎదుగుదల కాదని, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే నిజమైన పురోగతిగా భావించాలని కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: లండన్ డిప్యూటీ మేయర్తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. మహేష్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ
భవిష్యత్తులో కూడా ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ భారతదేశాన్ని బలంగా నిలబెట్టడం కోసం కాంగ్రెస్ తన గళాన్ని.. మరింత బలంగా వినిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను ఎవరూ విస్మరించలేరని, ప్రజలే తుది తీర్పు ఇస్తారని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.