Sangareddy district: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా సమీపంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన డీడీయూ (DDU) స్కూల్కు చెందిన సుమారు 100 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్లోని వండర్లాకు విహారయాత్ర కోసం బయలుదేరారు. ఉల్లాసంగా సాగాల్సిన ఈ ప్రయాణం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా భయాందోళనల మధ్య ముగిసింది.
సంగారెడ్డి చౌరస్తా వద్ద ఈ రెండు బస్సుల డ్రైవర్లు అతివేగంగా.. ప్రమాదకరంగా వాహనాలను నడపడాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వాటిని ఆపాల్సిందిగా సంకేతాలు ఇచ్చారు. అయితే.. పోలీసుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని డ్రైవర్లు బస్సులను ఆపకుండా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే తమ వాహనాల్లో బస్సులను వెంబడించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ ఉత్కంఠభరితమైన ఛేజింగ్ కొనసాగింది.
బస్సులు కంది చౌరస్తా వద్దకు చేరుకోగానే.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్లు అత్యంత ప్రమాదకరంగా రాంగ్ రూట్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎదురుగా వచ్చే వాహనాల వల్ల భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు తక్షణమే స్పందించి డివైడర్ వద్ద బస్సులను చాకచక్యంగా అడ్డుకున్నారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పడమే కాకుండా.. బస్సులోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
బస్సులను ఆపిన అనంతరం.. పోలీసులు డ్రైవర్ల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి అతివేగంగా, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడపడంపై వారిని తీవ్రంగా మందలించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.
ఈ ఘటనతో విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పోలీసుల సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా వందలాది కుటుంబాల్లో విషాదం నిండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Konaseema: ఖతార్ దేశంలో కోనసీమ యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..