కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పరిణామంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కవిత రాజకీయ ఎత్తుగడలను ఎండగట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు కలిగి ఉంటారని పేర్కొంటూనే తొలిరోజే విమర్శలకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త పార్టీ స్థాపించినప్పుడు అధికార పక్షానికి సానుకూల సలహాలు సూచనలు ఇస్తే బాగుండేదని హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కవిత చేసిన ‘కర్కోటకుడు’ అనే వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన రాజకీయాల్లోకి వస్తూ సీఎం స్థాయి వ్యక్తిని దూషించడం సంస్కారం కాదని మండిపడ్డారు. పార్టీ ప్రారంభోత్సవ సమయంలోనే ఇటువంటి విమర్శలు చేయడం చూస్తుంటే కవితలో ఉన్న అధికార దాహం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూడలేకనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
కవిత సొంత కుటుంబం నుంచి ఎదుర్కొన్న పరిణామాలపై పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. ‘సొంత ఇంటి నుంచి బయటకు గెంటేస్తే.. ఇప్పుడు బయటకు వచ్చి అధికారం కోసం కొత్త పార్టీ పెట్టారు’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కవితకు ప్రజలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే ఓర్వలేకనే కొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి విమర్శించారు. రాజకీయ పోరాటం అనేది సామ బేధ దండోపాయాలతో కూడి ఉండాలని సూచించారు.
సొంత తండ్రి కేసీఆర్ గురించి కవిత ఇప్పుడు మాట్లాడుతున్న తీరు విచిత్రంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు తండ్రితో కలిసి రాజకీయం చేసి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారంటే కేసీఆర్ ఎలాంటి వారో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ విధానాలు ఏమిటో ప్రజలకు వివరించకుండా కేవలం ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నారు. కవిత తీరును చూస్తుంటే కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ పార్టీని స్థాపించినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు గర్వంతో వ్యవహరించి ఇప్పుడు అధికారం లేకపోయేసరికి కొత్త వేషాలు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారంజక పాలనను అస్థిరపరిచేందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కవిత విమర్శలను ప్రజలు ఏమాత్రం నమ్మరని అలాగే రాబోయే రోజుల్లో ఆమెకు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టం చేశారు.
ALSO READ: రాఘవ్ చద్దాకు బిగ్ షాక్.. రాత్రికి రాత్రే 10 లక్షల మంది అన్ ఫాలో