Prabhakar Rao: మాజీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మొదటి రోజు కస్టడీ విచారణను శుక్రవారం ప్రారంభించింది. ఉదయం 11 గంటల నుండి ఈ విచారణ కొనసాగింది. రాజకీయ ప్రముఖులు సహా అనేక మంది పౌరుల ఫోన్ ట్యాపింగ్, డేటా ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును ఏడు రోజుల కస్టడీలో భాగంగా సిట్ బృందం ప్రశ్నించనుంది. విచారణ పురోగతిని పర్యవేక్షించేందుకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సిర్ ఇక్బాల్ కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పీఎస్ కి మరోసారి చేరుకున్నారు.
ఈ తొలిరోజు విచారణలో సిట్ బృందం పలు కీలక అంశాలను ఆయన ముందుంచింది. ముఖ్యంగా, ఆయనకు చెందిన ఐఫోన్ నుండి డిలీట్ అయిన డేటాను తిరిగి పొందే ప్రక్రియ (డేటా రిట్రీవ్) వివరాలు, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నుండి అందిన రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. సెల్ ఫోన్లలో, ఐ క్లౌడ్ (iCloud) లోని డేటాను పూర్తిగా డిలీట్ చేయడానికి గల కారణాలను, ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశాలను అధికారులు ఆరా తీశారు. డేటా డిలీట్ ప్రక్రియలో ఆయన పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రికార్డ్ చేసిన రాజకీయ ప్రముఖులు, ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను (స్టేట్మెంట్లను) ఆధారంగా చేసుకుని సిట్ విచారణ కొనసాగిస్తోంది. ముఖ్యంగా, సాక్ష్యాలను ధ్వంసం చేసే ఉద్దేశంతో ఐక్లౌడ్ డేటాను తుడిచివేయడం, కార్యాలయంలోని హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం వంటి చర్యలపై సిట్ బృందం ప్రభాకర్ రావు నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ డేటా ధ్వంసం వెనుక ఏ రాజకీయ నాయకుడి కుట్ర ఉందనేది దర్యాప్తులో ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ కేసులో మరింత లోతుగా సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
విచారణ సందర్భంగా, ప్రభాకర్ రావుకు ఇంటి నుండి భోజనం, అవసరమైన మందులను ఆయన కుమారుడు పీఎస్ వద్దకు అందించినట్లు సమాచారం. మొత్తం ఏడు రోజుల పాటు జరిగే కస్టోడియల్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విచారణ ద్వారా ఫోన్ ట్యాపింగ్ మరియు డేటా ధ్వంసం కేసులో కీలక సమాచారం, అలాగే ఇతర ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకుల పాత్ర ఉంటే, ఆ వివరాలు బయటపడే అవకాశం ఉంది.
ALSO READ: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగింపు