Cm Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను విజయోత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని చెప్పారు.
ఈ నెల 30వ తేదీన మహబూబ్నగర్లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలన్నారు. ఆ వేదికగా గ్రూప్-4 తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించాలని చెప్పారు.
డిసెంబర్ 1 వ తేదీ నుండి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలని అన్నారు. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలని ఆదేశించారు.
Also read: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఆ ఆరోపణలపై సృజన్ రెడ్డి సీరియస్
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సచివాలయ పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు.
అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. డిసెంబర్ 9 న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆదేశించారు.
ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి… లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు.