Nizamabad Floods: నిజామాబాద్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు వెంకటాపూర్ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి. వెల్లుట్ల వైపు వెళ్లే రహదారిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై.. 4 పీట్ల మేర వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముంపు నీటిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గ్రామంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులను వరద నీరు ముంచెత్తడంతో గ్రామస్తులు బయటకు రాకుండా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయారు. జంగంపల్లి గ్రామంలో హైవే రోడ్డు నుంచి కంపెనీలకు వెళ్లే దారిలో వర్షపు నీరు ఉండడం వల్ల కారు గుంతలో మునిగిపోయింది.
నిజామాబాద్ను ముంచెత్తుతున్న వానలు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు , వంకలు పొంగి పొర్లాయి. రహదారులు తెగిపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హాజీపూర్ తండా చెరువు కట్ట తెగిపోయింది. భారీ ఎత్తున దిగువ ప్రాంతాలకు వరద నీరు పోతుంది. దిగువన ఉన్న జిత్య తండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరింది. వరద ఉద్ధృతి కారణంగా రుద్రారం-ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. వరద తాకిడికి కొట్టాల్-లక్ష్మాపూర్ బ్రిడ్జ్ తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీట మునిగిన వందల ఎకరాలు
ఎల్లారెడ్డికి వెళ్లే పీడబ్ల్యుడి రోడ్డుపైనా 300 మీటర్ల పొడవున వరదనీరు విస్తరించింది. నాలుగు ఫీట్ల లోతుతో ప్రవహిస్తోంది. ఈ భారీ వర్షాలు వందల ఎకరాల్లో పంటలను తుడిచిపెట్టాయి. దీనికి కారణం 10 రోజుల క్రితం నర్వ చెరువు అలుగుపై మట్టి పోయడం అంటూ వాపోతున్నారు గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి అంటూ ఆరోపిస్తున్నారు.
రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన రోడ్లు
అలాగే మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట, సదాశివనగర్తో పాటు… గాంధారి, రామారెడ్డి, పల్వంచ, లింగంపేట, సదాశివనగర్ మండలాలలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పలు కూరగాయల పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి జిల్లాలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,వంకలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్లోని రైల్వే ట్రాక్ను వరదలు ముంచేసాయి. రైలు పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కామారెడ్డి వైపు వెళ్లే అన్ని ట్రైన్లను మళ్లించారు రైల్వే అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు.
Also Read: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!
కల్వర్టులపై నీటి ప్రవాహం ఉంటే రాకపోకలు నిషేధించాలి-సీఎం
నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని చెప్పారు. ఇక చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాగులో చిక్కుకున్న రైతులు
భారీ వర్షాలకు గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లిన రైతులు ప్రమాదంలో చిక్కుకుని.. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ ఉండే ఎగువ మానేరు జలాశయం రెండు మత్తళ్ళు పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. గేదెలను మేపడానికి వెళ్లిన రైతులు వాగు మధ్యలో చిక్కుకున్నారు.. అయితే వారు పోలీసులకు ఫోన్ చేయగా.. వారీతో పోలీసులు మాట్లాడుతున్నారు. సహాయ చర్యలు చేపట్టేలా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వాగు మధ్యలో చిక్కుకున్న రైతులు. జంగం స్వామి, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామిగా తెలిపారు.