Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంచాయితీని తెంచేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఏఐసీసీ ముందు ఆయన్ను కాంప్రమైజ్ చేసేందుకు ముఖ్య నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలు కూడా ఈ అంశంపై స్పందించినట్లు తెలిసింది. నేరుగా రాహుల్ నేతృత్వంలోనే చర్చించి, ఆ ఎపిసోడ్ కు చెక్ పెట్టాలని రాష్ట్ర పార్టీ కూడా భావిస్తున్నది. గురువారం ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలను కేబినేట్ మంత్రులు కలిసిన సమయంలో రాజగోపాల్ రెడ్డి వివాద అంశం తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ..ఢిల్లీలోనే రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతామని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా సెటైర్లు వేస్తున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఏఐసీసీ సీరియస్గా తీసుకుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలి.. లేదంటే నా టార్గెట్ ముఖ్యమంత్రి పదవే ’అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ నేతలతో చర్చలు జరిగాయి. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి, రాహుల్ గాంధీ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆయన అభ్యంతరాలు ఏమిటి? పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం ఏమిటి? అనే అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు పీసీసీ చీఫ్ కూడా స్పష్టం చేశారు.
కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి ,అధిష్టానం మధ్య ఒక ప్రాథమిక అవగాహన కుదిరినట్లు సమాచారం.ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు’ సాధ్యమా? అన్న కోణంలోనూ విశ్లేషణ జరుగుతోంది. అవసరమైతే వెంకట్ రెడ్డిని పార్టీ బాధ్యతల్లోకి తీసుకుని, రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. లేదా కీలకమైన చైర్మన్ ఇచ్చి, క్యాబినేట్ర్యాంక్ ఇస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై కూడా డిస్కషన్ జరుగుతుంది.
వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి తన పంథా మార్చుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని టీపీసీసీ హెచ్చరించినా, ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీంతో ‘బుజ్జగింపు’ కంటే ‘పరిష్కారం’ వైపే ఏఐసీసీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్, ఇలాంటి అసమ్మతి జ్వాలలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్ని జిల్లాల్లోని తన మిత్రులు,అనుచరులు, రాజకీయ నిపుణులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని హైకమాండ్ సీరియస్ గా ముందుకు సాగుతున్నది.