Rajiv Swagruha: స్వేఛ్చ బ్యూరో: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలో తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు. బాటసింగారం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ రెండ్రోజుల పాటు కొనసాగనున్న ఈ వేలం పాట తొలిరోజున శనివారం నాడు 70 ప్లాట్లను విక్రయించారు. ఈ ప్రాంతంలోని భూములను గరిష్టంగా చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు చేశారు. తొర్రూర్ తోపాటు ఒఆర్ ఆర్ కు సమీపంలోని బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం విక్రయించిన భూముల ద్వారా సుమారు రూ.56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.
తొర్రూర్ లోని ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేయడానికి దాదాపు 150 మంది ముందుకు వచ్చారన్నారు. వీరిలో అనేక మంది కుటుంబసమేతంగా వచ్చి తమకు నచ్చిన ప్లాట్ ను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారని పేర్కొన్నారు. ఒక కార్నర్ ప్లాట్ ను దక్కించుకోడానికి వేలంలో 20 సార్లకు పైగా ధరలు పెంచుతూ పోటీ పడటం ఇక్కడి ప్లాట్లకు ఉన్న డిమాండ్కు నిదర్శనంగా చెప్పుకొచ్చారు. 200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్ సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, రూ.43 వేలు, రూ.41 వేలకు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. మొత్తం మీద ఇక్కడ వేలం వేసిన భూములు సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయని గౌతమ్ తెలిపారు. కాగా ఆదివారం తొర్రూర్ లే అవుట్ లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
Also Read: Pragya Nagara : వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోతున్న ప్రగ్యా..కళ్లు తిప్పుకోవడం కష్టం..
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి లాటరీ ప్రక్రియ లో కేటాయించడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సుమారు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.
Also Read: Eye care: కళ్ల ముందు నల్లటి చుక్కలు కనిపిస్తున్నాయా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలివే!