Rangareddy News: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన విచిత్రం అనడం కంటే అంతకుమించి అంటే బెటర్ అనేలా ఉంది. అక్కడక్కడ ఓట్లు గల్లంతవుతూ ఉంటాయి. కానీ.. అభ్యర్థి ఓటు గల్లంతు అయితే ఏం చేస్తాం. అవును రంగారెడ్డి జిల్లాలో ఓ ఘనుడు తనకు ప్రత్యర్థిగా ఉంటాడని ముందే ఉహించి తన ప్రత్యర్థి ఓటును ఏకంగా వేరే గ్రామానికి బదిలీ చేయించాడు. ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లికి చెందిన సలీమ్ అనే వ్యక్తి పంచాయితీ ఎన్నికలలో 5 వార్డ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఓటర్ జాబితాను పరిశీలించగా.. తన పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించాడు. అతని ఓటు మొగిలిగిద్ద గ్రామానికి బదిలీ అయిందని తెలిసి కంగుతిన్నాడు.
తన ప్రమేయం లేకుండా తన ఓటు ఎలా బదిలీ అయిందని ఆరా తీస్తే.. అధికారులు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను పోటీచేయాలనీ భావించిన వార్డులో తన ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన అంజాద్ అనే వ్యక్తి తన ఓటు బదిలీ చేయంచాడని తెలుసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే తనను ఇంత ఘోరంగా దెబ్బతీసిన అంజాద్కు ఎవరు ఓటు వేయొద్దంటూ గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తూ గ్రామంలో సలీం పోస్టర్లు వేయించాడు.
సలీం ఓటు కంసాన్ పల్లి గ్రామం నుంచి మొగలిగిద్ద గ్రామానికి బదిలీ అయిందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తన ప్రమేయం లేకుండా తన ఓటును ఎవరు బదిలీ చేశారని సలీం ఆర్టీఐ ద్వారా అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. సమాచార హక్కు చట్టం ప్రకార ఇచ్చిన సమాచారంతో సలీం ఆశ్చర్యపోయాడు. తన గ్రామానికి చెందిన మహమ్మద్ అంజాద్ అనే వ్యక్తి తన ఓటును మరో గ్రామానికి బదిలీ చేసేందుకు దరఖాస్తు చేసినట్టు తెలుసుకున్నాడు. గ్రామంలో తనపై పోటీ చేస్తానన్న దుర్బుద్ధితో తన ఓటును తన ప్రమేయం లేకుండా బదిలీ చేశాడని బాధితుడు సలీం ఆరోపించారు.
Also Read: Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
తన ఓటు హక్కును అక్రమంగా బదిలీ చేసిన మహమ్మద్ అంజాద్ పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సలీం కోరాడు. అతన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని బాధితుడు సలీం డిమాండ్ చేశాడు. తన ఓటును అక్రమంగా బదిలీ చేసిన అంజాద్ పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.