PM Modi: ఉన్నట్టుండి దక్షిణాది బాట పట్టారు ప్రధాని మోదీ. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరుస పర్యటనలు పెట్టుకున్నారు. చిన్నచిన్న కార్యక్రమాలకే పెద్ద ప్రచారం చేస్తూ.. మోదీ పేరు మారిపోయేలా చేస్తున్నారు. పీఎం మోదీ రెండు రోజుల సౌత్ ఇండియా వెనుక అసలు కారణం వేరే ఉందంటోంది కాంగ్రెస్.
మోదీకి రాహుల్ భయం పట్టుకుందట. భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతుండటంతో కమలనాథులు బెదిరిపోతున్నారట. అందుకే, కేరళ మినహా ఇప్పటి వరకూ రాహుల్ ఎక్కడెక్కడ పాదయాత్ర చేశారో.. ఆయా రాష్ట్రాలను కవర్ చేసేలా మోదీ టూర్ ప్లాన్ చేశారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావంతోనే ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ అన్నారు. “రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రాహుల్ తో కలిసి నడుస్తూ ఎంతో మంది తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఈ ప్రజాదరణను ఎలాంటి వ్యతిరేక శక్తులు ఆపలేవు. జోడో యాత్ర ప్రభావంతోనే ప్రధాని దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చారు. మోదీ పర్యటనలో ఫొటోషూట్ హడావుడి మినహా మరేం ఉండదు” అంటూ జైరాం రమేశ్ విమర్శించారు.
వందేమాతరం రైలుకు జెండా ఊపడం, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం, తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం.. ఇలాంటివన్నీ ప్రధాని స్థాయి కార్యక్రమాలు కావని.. రాహుల్ గాంధీకి పోటీగా షో చేయడానికే మోదీ వస్తున్నారేది కాంగ్రెస్ ఆరోపణ.