జిల్లాలోని కంది మండల కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాద వివరాలు..
సంగారెడ్డి పట్టణం నుండి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంది మండల కేంద్రానికి చేరుకోగానే ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా టిప్పర్ లారీ ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.