ఏపీ, తెలంగాణలో కొత్త రకం రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న వారంతా అధికారంలో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఏ రాజకీయ నాయకులు అయినా పక్క రాష్ట్రంతో వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలని చూస్తారే గానీ, కొత్తగా తలనొప్పులు తెచ్చుకోవాలని కోరుకోరు కదా.. మరి ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు పక్క రాష్ట్రంతో కయ్యం కావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ అదే జరిగితే మధ్యలో ఉండి చూస్తూ ఆస్వాదించాలనుకుంటున్నారా? ఈ వంకతో ప్రజలను డైవర్ట్ చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం నడిచింది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ మూడ్లో పొలిటికల్ పార్టీలు ఉండటంతో దీనిపై చర్చ జరగడం లేదు. ఏపీలో కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. ముందుగా పోలవరం నుంచి బనకచర్ల ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తీసుకురాగా.. తెలంగాణ అభ్యంతరంతో కేంద్రం అందుకు నో చెప్పింది. తాజాగా అదే పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీటిని ఎత్తిపోయాలని ఏపీ భావించింది. ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళనలతో తెలంగాణ సర్కార్ సైతం దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. తన శిష్యుడి కోసం గురువు చంద్రబాబు ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని.. తానే దగ్గరుండి కేసులు వేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక తెలంగాణ విషయానికొస్తే కృష్ణా జలాల్లో దోపిడీకి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని.. ఇదంతా సీఎం రేవంత్కు తెలిసినా తన పాత గురువు కోసం చూస్తూ ఉంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కోసం రేవంత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని వీరు ఆరోపణలు చేస్తున్నారు.ఇదే విషయంపై ప్రజాఉద్యమం చేస్తామని ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి ఊసెత్తలేదు.
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి సీఎం రేవంత్, ఆదిలాబాద్ నుంచి పర్యటన
రేవంత్ చంద్రబాబు ఒక్కటై ఏపీకి అన్యాయం చేస్తున్నారని అటు ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. తెలంగాణకు వచ్చేసరికి పాత బాస్ కోసం శిష్యుడు రాష్ట్రప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తున్నాడని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.ఇదిలాఉంటే.. జగన్, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి నదీ జలాలపై ఒప్పందాలు చేసుకున్నారని.. కేసీఆర్ కృష్ణా నదీలో 299 టీఎంసీలకు ఒకే చెప్పారని.. ఏపీకి 511 టీఎంసీలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అందుకే ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ మరోసారి నదీ జలాల వివాదం ఏర్పడిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. తెలంగాణ ప్రజలకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని అధికార కాంగ్రెస్ చెబుతున్నది. మరోవైపు ఏపీ సైతం.. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయని చెబుతున్నది.