RevanthReddy: రేవంత్రెడ్డి. టైమ్ అనుకూలించడం లేదు కానీ.. లేదంటే ఆయనంత స్ట్రాంగ్ లీడర్ ఎవరూ లేరిక్కడ. కాంగ్రెస్ గుర్రాన్ని జాగ్రత్తగా స్వారీ చేస్తూ.. ఎన్నికల దిశగా దౌడు తీయిస్తున్నారు. అయితే, కొందరు సొంతపార్టీ నేతలే ఈ రేసుగుర్రానికి కళ్లెం వేసే కుట్రలు చేస్తుండటం దారుణం. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని.. ఎప్పటికైనా కేసీఆర్ కాంగ్రెస్తో కలవాల్సిందేనంటూ కోమటిరెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు పార్టీకి నష్టం చేకూర్చే మాటల మాట్లాడుతుండటం మంట రాజేస్తోంది.
బీఆర్ఎస్ పొత్తు. కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై ఇంతలా పోరాడుతుంటే.. నిత్యం కేసీఆర్ పాలనపై మాటల తూటాలు పేలుస్తుంటే.. కొందరు మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే.. ప్రజలు నిజమే అనుకునే ప్రమాదం ఉందని భావించిన రేవంత్రెడ్డి.. తాజాగా బీఆర్ఎస్తో పొత్తుపై పదునైన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని తేల్చి చెప్పారు.
తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని.. మాఫియాతో కాంగ్రెస్ చేతులు కలపదని.. కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ ఎన్నటికీ క్షమించదని అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే కాంగ్రెస్ నేతలను పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లు కూడా రావని.. అలాంటి పార్టీతో తామెందుకు పొత్తు పెట్టుకుంటామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్పై 80శాతం మంది ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. బీజేపీ మళ్లీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని చెప్పారు. 80 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోందని రేవంత్ అన్నారు. “ప్రచారంలో ముగ్గురుంటారు.. కానీ చివరకు మిగిలేది ఇద్దరే.. బీజేపీతో కొట్లాడినట్టు నటించి కాంగ్రెస్ను మింగేస్తారు.. బీజేపీ ఇచ్చిన టాస్క్ను కేసీఆర్ అమలు చేస్తున్నారు”.. అంటూ ఆ మూడు పార్టీలపై పీసీసీ చీఫ్ విరుచుకుపడ్డారు.