Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదని సీఎం చెప్పారు. అందుకే క్రియాశీలక రాజకీయాల్లో కేసీఆర్ చురుగ్గా ఉండలేకపోతున్నారని తెలిపారు. రాజకీయాల్లో క్రియాశీలక లేని కేసీఆర్ పై తాను ఎటువంటి విమర్శలు చేయనని స్పష్టం చేశారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన తీర్పని, అది తన ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, రాష్ట్ర రాజకీయాలపై సూటిగా, కొన్ని సందర్భాల్లో ఘాటుగా స్పందించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే ఊగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీ ధోరణి కాదు. ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు అన్ని పార్టీల వ్యవహార శైలిని జాగ్రత్తగా గమనించి ఈ తీర్పుకు వచ్చినట్లు తెలిపారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్కు 51 శాతం, బీఆర్ఎస్కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు పోలింగ్ కావడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో.. 60–65 శాతం హైద్రాబాద్ నగరం నుంచే వస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ నగరం సంపాదించే ప్రతి రూపాయిని తిరిగి ఈ నగర అభివృద్ధికే వినియోగిస్తాం. ఇది మా బాధ్యత, మా కర్తవ్యము అంటూ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, కాలువ వ్యవస్థలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఐటీ కారిడార్ విస్తరణ అన్నీ వేగవంతం చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి సిటీగా మార్చేందుకు ఇప్పటికే పెట్టుబడిదారులతో చర్చలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చేలా క్లియర్ పాలసీలను అమలు చేస్తున్నాం అని సీఎం చెప్పారు. నగరం అభివృద్ధి చెందితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని కూడా స్పష్టం చేశారు.
ముఖ్యంగా బీజేపీపై సీఎం రేవంత్ విమర్శించారు. హైదరాబాదు అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు ప్రత్యేకంగా నిలిపివేస్తున్నారు అని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగరాభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు, ఫండ్లు, యూ.ఎం.టిఏ, మెట్రో విస్తరణ ప్రతీ అంశంలో BJP అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.
సీఎం రేవంత్, BRS నేతల వైఖరిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి. హరీష్ రావు అసూయను తగ్గించుకోవాలి. కేటీఆర్ నాకంటే వయసులో చిన్నవాడు, కానీ మాట్లాడే తీరు మాత్రం పెద్దదనం చూపేలా ఉంది అన్నారు.
తెలంగాణ ప్రజలు మా ఉద్యమం, మా పాదయాత్రలను నమ్మి 65 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. 8 పార్లమెంట్ సీట్లు కూడా కాంగ్రెస్కు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను మేము నిలబెట్టుకుంటాం అని రేవంత్ చెప్పారు.
Also Read: జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై మాట్లాడుతూ, BRS, BJP కలిసి ఉన్నా మా అభ్యర్థిని ఆపలేకపోయారు. ప్రజలు నవీన్ యాదవ్కు విపరీతమైన మద్దతు ఇచ్చారు. ఇది కేవలం ఉపఎన్నిక ఫలితం కాదు.. ప్రజల ఎడమరై ప్రజాస్వామ్య తీర్పు అని సీఎం అన్నారు.