Revanth Reddy: దేశ రాజకీయాల్లో మళ్లీ కాక రేగుతోంది. నిరసన తెలపడం ప్రజాస్వామ్యం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిపై కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండించదగిన విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల అక్రమ అరెస్టులపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదం..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేసే ధోరణిని అవలంబిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం అందించిన నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏమాత్రం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యువత సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారి తరఫున పోరాడుతున్న నాయకులను జైల్లో పెట్టడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కుటుంబం యువత వెంటే..
న్యాయం, జవాబుదారీతనం కోసం వీధుల్లోకి వచ్చి ప్రశ్నిస్తున్న దేశ యువతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. “మమ్మల్ని జైల్లో వేసి అడ్డుకోవడానికి చూడొచ్చు.. మా గొంతును అణచివేయాలని ప్రయత్నించవచ్చు. కానీ న్యాయబద్ధమైన హక్కుల కోసం లక్షలాది మంది యువకులు చేస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని, వారి ఆగ్రహజ్వాలలను మీరు ఎప్పటికీ ఆపలేరు” అని రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరు
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేవలం ఒక పార్టీ నేతలుగా కాకుండా, దేశ యువత ఆకాంక్షలకు, హక్కులకు ప్రతినిధులుగా పోరాడుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఇటువంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ నాయకత్వ ధైర్యాన్ని దెబ్బతీయలేరని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత భావిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయంలో కాంగ్రెస్ ఫ్యామిలీతో పాటు మొత్తం దేశం యువత వైపే నిలబడుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: హైదరాబాద్లో కొవిడ్ కలకలం.. గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ లక్షణాలు!