CM Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వంలో పదవులు కేటాయించడంలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీకి మద్ధతుగా, ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన నేతలకు వరుసగా పదవులు లభిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కావడంలో రేవంత్ కు సహకరించిన లీడర్లకు ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పదవుల నుంచి తాజాగా ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల వరకు సీఎం రేవంత్ తన మార్క్ ను ప్రదర్శించారని పార్టీ వర్గాల్లో చర్చంశనీయమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ వరకు ప్రతి నిర్ణయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక శైలి కనిపిస్తోంది. కేవలం సామాజిక సమీకరణలే కాకుండా, పార్టీ, తనను నమ్మిన లీడర్లకు ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ జరుగుతుంది. అంతేగాక పార్టీ, ప్రభుత్వంలో ఒక బలమైన టీమ్ను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉన్నది.
తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి తన పట్టును నిరూపించుకున్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తన అత్యంత సన్నిహితుడు, రాజకీయ వ్యూహకర్త అయిన వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపడంలో ఆయన విజయం సాధించారు. పార్టీలో ఏకంగా 16 మంది కీలకనేతలు రేసులో నిలిచినప్పటికీ, ఏఐసీసీ పెద్దలను ఒప్పించి మరీ సీఎం వేం కు పదవి రావడంలో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి వేం నరేందర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత రేవంత్ సీఎం కావడంలో అన్ని విధాలుగా సపోర్టుగా నిలిచారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ యాక్టివిటీస్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు తదితరవన్నీంటిని సక్సెస్ చేసేందుకు వేం నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా మానిటరింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాలనలోనూ, రాజకీయ వ్యవహారాల్లోనూ తనకు సపోర్టు కోసం వేం నరేందర్ రు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎమ్మెల్సీ మిస్ అయినందున, ఇప్పుడు ఆయన్ను ఏకంగా దేశ పెద్దల సభలకు పంపించడంలో సీఎం క్రియాశీలక పాత్ర చూపించడం విశేషం.
Also Read: Kona Venkat: ‘మెగా158’ తర్వాత బాబీ నెక్ట్స్ సినిమా ఆ స్టార్ హీరోతోనే!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసిన వారికి ప్రభుత్వంలో స్థానం కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వంలోకి రాగానే వెంటనే 37 మందికి కార్పొరేషన్ పదవులు కేటాయించారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో తనకు గాంధీభవన్ వేదికగా సహకరించిన మల్లు రవికి ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలవడంలో సీఎం తన వంతు పాత్రను పోషించారు. అంతేగాకుండా హర్కర వేణుగోపాల్ , షబ్బీర్ అలీలకు ప్రభుత్వ సలహాదారులుగా పదవులు ఇచ్చారు. దీంతో పాటు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ కు శివసేనారెడ్డి, నేరేళ్ల శారద, ఈరవత్రి అనిల్ కుమార్, అన్వేష్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, ఇలా తదితరులందరికీ కార్పొరేషన్ పదవులు ఇవ్వడంలో సీఎం సఫలీకృతమయ్యారు.
అంతేగాక చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ సీటు ఇప్పించి, గెలిపించే బాధ్యతలను కూడా సీఎం తీసుకోవడం విశేషం. మంచి పదవి వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇలా చాలా మంది నేతలకు పదవులు కల్పించడంలో సీఎం సక్సెస్ అయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సర్వేలు ఆధారంగా తన కు సన్నిహితులుగా ఉన్న లీడర్లలో చాలా మందికి టిక్కెట్ లు వచ్చేలా సీఎం ప్రయత్నించారు. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడమే కాకుండా, వారికి కార్పొరేషన్ పదవుల ద్వారా భరోసా కల్పించి సీఎం కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యత కల్పించారు. గతంలో తనతో పాటు నడిచిన నేతలకు వరుసగా పోస్టులు ఇస్తూ, పార్టీలో తన నాయకత్వం పట్ల తిరుగులేకుండా చూసుకుంటున్న సీఎం రేవంత్ పై పొలిటికల్ వర్గాల్లో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.