Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తెలిపింది. అవాస్తవాలను దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
‘రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు, అలాగే రద్దు చేయడంలేదు. ప్రస్తుతం, సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయి. అలాగే, ఆర్థిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. రైతు భరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం, అలాగే లబ్ధిదారులను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉంది’ అని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
‘వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందితే, అలాంటి వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సహాయంతో ‘శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది. 2024లో నిర్వహించిన ఒక గ్రౌండ్ సర్వే ప్రకారం 4 లక్షల ఎకరాలు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది.
ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుని దగ్గర ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందో నిర్దారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచర్, కొండ, రోడ్ లేదా ఫామ్ హౌస్ అని ధృవీకరించడానికి కూడా సహాయపడుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అర్హులు కాదు. మ్యాపింగ్ ప్రక్రియ ఫీల్డ్ డేటాను రికార్డులతో ధృవీకరించడానికి మాత్రమే. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా జాబితా నుండి తొలగింపులు ఉంటాయి’ అని ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ స్పష్టం చేసింది.
రైతు భరోసా పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది సుమారు రూ. 8,500– రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించింది. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదని పేర్కొంది. ఒక రైతు రబీ/ఖరీఫ్ కాలాలలో పంటను పండించవచ్చు, అటువంటి వారు కూడా రైతు భరోసా పథకానికి అర్హులే అని తెలిపింది.
ఒక సీజన్లో ఒకే పంట పండించినా రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు రెండు సీజన్లకు ఎకరానికి రూ. 12,000 అందుతుందని తెలిపింది. జాబితా నుండి పేర్లు లేకపోతే.. అభ్యంతరాలు ఉన్న రైతులు జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.
Also Read: Vemulawada: వేములవాడలో దళారుల దందా.. ఏడుగురిపై కేసు నమోదు
గత ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ 90 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సిన రైతు భరోసా పంపిణీని కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసిందని అధికారులు తెలిపారు. రైతు భరోసాపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.