Oil Palm: స్వేచ్ఛ బ్యూరో: వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు రైతు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందని వెల్లడించారు. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో స్థాపించబడిన రెండు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు నిర్వహణలో ఉన్నాయనితెలిపారు. ఈ మిల్లుల సమిష్టి సామర్థ్యం గంటకు 120 మెట్రిక్ టన్నులు (ఎంటీ)గా ఉందని చెప్పారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్లు ఆయిల్ పామ్ రైతులు పండించే పండ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి వారికి సరైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిందని తెలిపారు. ప్రారంభ దశలో ఈ యూనిట్ గంటకు 30 టన్నుల (30 టీపీహెచ్) సామర్థ్యంతో పనిచేయనుండగా, భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల (120 టీపీహెచ్) వరకు విస్తరించే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఆయిల్ పామ్ రైతులకు మద్దతుగా నిలవనుందని పేర్కొన్నారు.
Also Read: Minister Seethakka: అంగన్ వాడీ చిన్నారులకు.. త్వరలో మరో కొత్త పథకం..!
ఈ యూనిట్ ప్రారంభంతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రాసెసింగ్, నిల్వ,మార్కెటింగ్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రైతులు తమ పంటలను నేరుగా ఈ ప్రాసెసింగ్ యూనిట్కు తీసుకువచ్చి ప్రాసెస్ చేయించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో నూనె తయారీ జరగడం వల్ల నాణ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలు, ఉత్పత్తి పెంపు మార్గాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా సమాచారం అందించనున్నట్లు తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి విక్రమార్క..!