Samatha Kitchen: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తుందని, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, సీఈవో నిర్మాణ్ ఆర్గనైజేషన్ తో కలిసి కలెక్టరేట్ లో సమత కిచెన్ ను మంత్రి గురువారం ప్రారంభించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కొత్తగా ప్రారంభించుకున్న సమతా కిచెన్ ద్వారా దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఇతర అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. సమాజంలోని వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేసి, వారికి ఆర్థిక చేయూతనిచ్చి, ఆర్థికంగా వృద్ది చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆరు మంది ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సహాయం
ఆర్థిక పునరావాస పథకం కింద ఆరు మంది ట్రాన్స్జెండర్ లబ్ధిదారులకు రూ. 75 వేల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను, ఐదు మంది దివ్యాంగులకు రూ. లక్షా 18 వేల 500 విలువైన బ్యాటరీ వీల్ చైర్లను మంత్రి అందజేశారు. సమతా కిచెన్ లో ఆరు మంది ట్రాన్స్ జెండర్లు, ఒక దివ్యాంగుడు కు ఉపాధి కల్పించడం హర్షించదగ్గ విషయమని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక చర్యలు
దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10.47 లక్షల మంది దివ్యాంగులు, మరో 10 లక్షల మంది వృద్ధులున్నారని, అందులో హైదరాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల మంది వృద్ధులు నివసిస్తున్నారని తెలిపారు. 50 వేలకు పైగా సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందని, 5 వేల యూడీఐ కార్డులు జారీ చేశామని, అలాగే 29 వేల 902 మంది దివ్యాంగులకు పింఛన్లు అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 404 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు పత్రాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..
రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో అంతర్భాగమని, వారి సామాజిక ఆదరణ, గౌరవప్రద జీవనాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు పెరుగుతున్న అవకాశాలను అభినందిస్తూ, పోలీస్ శాఖలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపాధి కల్పన వంటి చర్యలు సమాజ మార్పుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారికి రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో మరింత ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.
హరిచందన దాసరి మాట్లాడుతూ..
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని వివరించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు వారి ఆసక్తికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జిల్లా దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ అధికారి రాజేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అశన్న, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ప్రవీణ్, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఇలియా అహ్మద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పవన్ కుమార్, ఏఓ విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం? కవిత లేవనెత్తిన కీలక అభ్యంతరాలు ఇవే!