Women Reservation: స్వేచ్ఛ బ్యూరో: మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళా బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చిందన్నారు.
మహిళా బిల్లుకు జాగృతి పాత్ర
మనం వెలిగించిన దీపంతో మహిళా బిల్లుకు ముందడుగు పడిందని, ఈ బిల్లు కోసం ఢిల్లీలో నేను చేసిన దీక్షకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తరలివచ్చారన్నారు. 18 పార్టీలను కో ఆర్డినేట్ చేసి వారు దీక్షలో పాల్గొనేలా చేశామని, పార్లమెంట్ లో ఈ అంశంపై ఆయా పార్టీల ఎంపీలు మాట్లాడే విధంగా ప్రయత్నం చేశామన్నారు. మహిళా బిల్లు కోసం జాగృతి ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచామని, ఫలితంగా మహిళ బిల్లు వచ్చిందని, ఈ బిల్లు రావటంలో జాగృతి పాత్రను మరవలేమన్నారు.
డిలిమిటేషన్తో ముడిపెట్టడంపై విమర్శ
కానీ బిల్లుకు సంబంధించిన ప్రయోజనం మాత్రం పోస్ట్ డేటేడ్ చెక్ మాదిరిగా ఉందని ఆనాడే నేను చెప్పానని, బీసీ ఆడబిడ్డలకు కోటా లేకుండానే ఈ బిల్లు పాస్ చేశారన్నారు. డిలిమిటేషన్ ను మహిళా బిల్లుకు ముడిపెట్టి పాస్ చేశారన్నారు. దీంతో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, అదే విధంగా ఆ తర్వాత జరిగిన 12 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు బిల్లు ప్రయోజనం రాలేదన్నారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని, దీంతో మళ్లీ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. 2027 జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి. ఈసారి జన గణనలో బీసీల లెక్క తీస్తామంటున్నారని, ఆ లెక్క తేలిన తర్వాత బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డ్రాఫ్ట్ బిల్లు పారదర్శకతపై ప్రశ్నలు
మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుందన్నారు. కొన్నిరోజుల్లో ఈ బిల్లు మీద చర్చ పెడుతామని చెబుతున్నారని, కానీ ఇప్పటి వరకు కూడా డ్రాఫ్ట్ బిల్లును ఏ పార్టీకి ఇవ్వలేదన్నారు. వెంటనే డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టే రోజు ఉదయమే బిల్లు ప్రతులను ఇస్తామని కేంద్రం చెబుతుందని, దీంతో అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదన్నారు.
బీజేపీపై విమర్శలు
బీజేపీ ఎప్పటిలాగే తమ మోసపూరిత వైఖరి అవలంభించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు విషయంలో 2027 జనాభా లెక్కల వరకు ఆగాలని పోరాటం చేయాల్సి ఉందని, ఇందుకు బీసీ బిడ్డలంతా కదలాలని పిలుపు నిచ్చారు. డ్రాఫ్ట్ బిల్లు అంశంతో పాటు 2011 జనాభా లెక్కలు ఆధారంగా చేసుకుంటామన్న బీజేపీ వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో మాతో కలిసి వచ్చిన 18 పార్టీలో నాయకులతో తాను మాట్లాడుతానని, మహిళలంతా సాధించుకున్న ఈ బిల్లులోని హక్కులను కచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ కాదు.. ఇది ‘కల్తీ’ సిటీ.. MLC అంజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!